Andhra Pradesh: ఎందుకిలా చేశావమ్మా?.. రూ.50 వేలకు అప్పుడే పుట్టిన మగబిడ్డ విక్రయం.. వెలుగులోకి సంచలన విషయాలు..

కన్నబిడ్డను తల్లే విక్రయించిన ఉదంతం ఆంధ్రప్రదేశ్‌లోని బెజవాడలో కలకలం రేపింది. జన్మనిచ్చిన కొద్దిరోజులకే మాతృత్వాన్ని మరచిన తల్లి వ్యవహారాన్ని ఆశ, అంగన్వాడీ వర్కర్లు బట్టబయలు చేశారు.

Andhra Pradesh: ఎందుకిలా చేశావమ్మా?.. రూ.50 వేలకు అప్పుడే పుట్టిన మగబిడ్డ విక్రయం.. వెలుగులోకి సంచలన విషయాలు..
New Born Baby
Follow us

|

Updated on: Oct 30, 2022 | 8:43 AM

కన్నబిడ్డను తల్లే విక్రయించిన ఉదంతం ఆంధ్రప్రదేశ్‌లోని బెజవాడలో కలకలం రేపింది. జన్మనిచ్చిన కొద్దిరోజులకే మాతృత్వాన్ని మరచిన తల్లి వ్యవహారాన్ని ఆశ, అంగన్వాడీ వర్కర్లు బట్టబయలు చేశారు. విజయవాడ నగరంలోని భానునగర్‌కు చెందిన కల్యాణి యాచక వృత్తిలో జీవిస్తోంది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒకరిని తన వద్ద పెట్టుకుని, మిగిలిన ఇద్దరిని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉంటున్న బంధువులకు ఇచ్చేసింది. కొద్దినెలల క్రితం కల్యాణి మళ్లీ గర్భం దాల్చింది. ఈ సమయంలో భానునగర్‌లో ఉండే అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి పోషకాహారాన్ని తీసుకునేది.

ఈ క్రమంలోనే ఈ నెల 23న విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో కల్యాణి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే వైద్యులు డిశ్చార్జి చేయకుముందే, ఆసుపత్రిలో సిబ్బందికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆమె ఇంటికి వెళ్లిపోయింది. తర్వాత కొన్ని రోజులకు తెలిసినవారి ద్వారా బేరం కుదుర్చకుని ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన ఓ కుటుంబానికి రూ.50 వేలకు శిశువును విక్రయించింది.

అయితే, శనివారం కల్యాణి కనిపించడంతో అంగన్ వాడీ కార్యకర్త ఆమెను ఆరా తీసింది. ఎన్నో నెల అని అడగడంతో పొంతన లేని సమాధానం చెప్పింది. రికార్డులను పరిశీలించగా ఆమెకు ఇప్పటికే డెలివరీ అయిపోయి ఉంటుందని అంగన్వాడీ కార్యకర్త గుర్తించింది. కల్యాణి సమాధానంతో ఆమెకు అనుమానం వచ్చింది.

ఇవి కూడా చదవండి

అనంతరం అంగన్వాడీ, ఆశ కార్యకర్త కలిసి ఆరా తీయగా ఆసుపత్రి నుంచి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కల్యాణి వచ్చేసిందని తెలిసింది. పుట్టిన బిడ్డని ఏం చేశావని ప్రశ్నించినా సమాధానమివ్వక పోవడంతో వారు గుణదల పోలీసులకు సమాచారం ఇచ్చారు.

టాస్క్‌ఫోర్స్ ఏసీపీ వీఎస్ఎన్ వర్మ, గుణదల ఇన్స్పెక్టర్ కృష్ణ మోహన్ ఘటనా స్థలానికి వెళ్లి.. ఆమెను విచా రించగా బిడ్డను కనిగిరిలోని ఓ కుటుంబానికి 50 వేలకు విక్రయించినట్టుగా అంగీకరించింది. పోషించే స్థోమత లేకపోవడంతో ఈవిధంగా చేశారని ఒప్పుకుంది. దీనిపై గుణదల పోలీసులు కేసు నమోదు చేసి.. శిశువులను విక్రయించే ముఠాకు చెందిన ఆరుగురు నిందితులను కటకటాల్లోకి నెట్టారు.

అయితే.. ముఠా సభ్యులు ఇప్పటివరకు నలుగురు శిశువులను విక్రయించినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు కోసం.. ఒంగోలు, రాజమహేంద్రవరం ప్రాంతాలకు సిబ్బందిని పంపించినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..