ఏడేళ్ల బాలుడి పేరుతో రేషన్ కార్డు జారీ.. కరోనా సాయంతో పాటు బియ్యం కూడా అందజేత కానీ..
ఆంధ్రప్రదేశ్లోని అవనిగడ్డలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. కుమారుడి పేరును రేషన్ కార్డులో చేర్చాలని కోరితే ఏకంగా కొత్త రేషన్ కార్డునే అందించారు అక్కడి
ఆంధ్రప్రదేశ్లోని అవనిగడ్డలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. కుమారుడి పేరును రేషన్ కార్డులో చేర్చాలని కోరితే ఏకంగా కొత్త రేషన్ కార్డునే అందించారు అక్కడి అధికారులు. దీంతో వారి పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వివరాల్లోకి వెళితే.. పాత ఎడ్లంక గ్రామానికి చెందిన మైలా నాగరాజు-మాధవి దంపతుల కుమారుడు ఓంకారశ్రీ.
ఈ ఏడాది ఏప్రిల్లో తమ కుమారుడి పేరును రేషన్ కార్డులో నమోదు చేయాలని గ్రామ వలంటీరుకు విజ్ఞప్తి చేశారు. అయితే కొన్నిరోజుల తర్వాత బాలుడి పేరుతో ఉన్న రేషన్ కార్డును ఆ దంపతులకు అందజేశారు. కార్డు ఎవరి పేరు మీద ఉంది. బాలుడికి రేషన్ కార్డు ఎందుకు జారీ అయింది అనేవి ఏవీ పట్టించుకోకుండా రేషన్ కార్డు అందించారు. దీంతో ఇప్పుడు వీరి పనితీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా కరోనా సాయంగా రూ.1000తోపాటు బియ్యం కూడా బాలుడికి మంజూరయ్యాయి. వాటిని ఆ కుటుంబ సభ్యులు తీసుకోలేదు. తమ కార్డులో పేరు చేర్చమని పులిగడ్డ సచివాలయ సిబ్బందికి అర్జీ పెట్టినా స్పందించలేదు. అయితే నాగరాజు దంపతులకు రేషన్కార్డు జారీ కావడం వల్ల పాఠశాలలో అమ్మఒడి పథకానికి తమ కుమారుడిని అనర్హుడిగా పేర్కొంటున్నారని ఆ దంపతులు మీడియా దృష్టికి తీసుకొచ్చారు.