
టిడిపి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో త్వరలో టిడిపిలో చేరనున్నట్టు ఒంగోలు ఎంపి మాగుంట ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి లతో టిడిపి నేతలు భేటీ అయ్యారు. ఎంపీ మాగుంటను ఆయన నివాసంలో టిడిపి మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, ముత్తుముల అశోక్ రెడ్డి, బిఎన్ విజయకుమార్, కందుల నారాయణరెడ్డి, ఒంగోలు పార్లమెంటు పరిధిలోని టిడిపి అసెంబ్లీ అభ్యర్థులు కలిశారు. ఇటీవల వైసిపికి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేశారు. తన కొడుకు మాగుంట రాఘవరెడ్డికి వైసిపి టికెట్ లేదని వైసిపి అధిష్టానం తేల్చి చెప్పడంతో మాగుంట కుటుంబం వైసిపి పార్టీని వీడింది. అనంతరం టిడిపిలో చేరే విషయంపై ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబుతో మాట్లాడుకున్న మాగుంట త్వరలోనే ఆ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవరెడ్డిలను ఆయన నివాసంలో టిడిపి మాజీ ఎమ్మెల్యేలు, ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని టిడిపి అభ్యర్ధులు కలిశారు. ఒంగోలు టిడిపి పార్లమెంటు టికెట్ ఆశిస్తున్న మాగుంట రాఘవరెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి.. త్వరలో టిడిపి పార్టీలో తాను, తన కుమారుడు రాఘవరెడ్డి చేరుతున్నట్టు ప్రకటించారు. ఎప్పుడు, ఎక్కడ అనేది టిడిపి అధినేత చంద్రబాబు నిర్ణయిస్తారని మాగుంట తెలిపారు. తనకు రాజకీయంగా రిటైర్మెంట్ వయసు వచ్చిందని, తన కొడుకు మాగుంట రాఘవరెడ్డికి ఒంగోలు పార్లమెంటు టికెట్ కోసం చంద్రబాబును అభ్యర్థించానని అన్నారు. బిజెపి, టిడిపి, జనసేన కూటమితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. పెద్దన్న మోడీ, చంద్రబాబు, సోదరుడు పవన్ కళ్యాణ్, యువనేత లోకేష్ ఆధ్వర్యంలో అందరం కలిసి పనిచేసి కూటమి విజయానికి కృషి చేస్తామని మాగుంట తెలిపారు.
ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి గత నెల ఫిబ్రవరి 28న వైసిపి పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో గౌరవం లేకపోవడం వల్ల పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఒంగోలులో ప్రకటించారు. పార్టీకి రాజీనామా చేయడం బాధాకరంగా ఉందన్నారు. తనకు ఈగోలు, అహం లేవని ఉన్నది కేవలం ఆత్మగౌరవం మాత్రమేనని, దాన్ని కాపాడుకునేందుకు వైసిపి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఎంపి మాగుంట తెలిపారు. ఎంపి పదవీకాలం ముగిసిపోయినందున ఆ పదవికి రాజీనామా చేయడం లాంఛనమే అన్నారు. ఏ పార్టీలో చేరతామన్నది తరువాత చెబుతామని అప్పట్లో తెలిపిన మాగుంట మార్చి 11న టిడిపిలో చేరుతున్నట్టు క్లారిటీ ఇచ్చారు.
ఒంగోలులో 1991 నుంచి 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నామని రాజీనామా చేసే ముందు ఫిబ్రవరి 28న ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి భావోద్వేగంతో మాట్లాడారు. తమ కుటుంబ సభ్యులు 8 సార్లు పార్లమెంటుకు, రెండుసార్లు అసెంబ్లీకి, ఒకసారి ఎమ్మెల్సీగా పోటీ చేశారన్నారు. మాగుంట అంటే ఒక బ్రాండ్ అని అభిమానులు చెబుతారన్నారు. మాకు ఈగో లేదు, అహం లేదు, ఆత్మగౌరవం మాత్రమే ఉందన్నారు. గౌరవం కోసమే రాజకీయాలు చేస్తున్నామని, ఆ గౌరవం నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నామన్నారు. తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని రానున్న ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేయించాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుత రాజకీయాలు చాలా బాధాకరంగా ఉన్నాయని, తన ఆత్మగౌరానికి సంబంధించిన విషయం కాబట్టి రాజీనామా చేయక తప్పడం లేదన్నారు. కొన్ని అనివార్య కారణాలతో వైసీపీని వీడుతున్నామని తెలిపిన మాగుంట ఈరోజు టిడిపి నేతలతో భేటీ అనంతరం తాను, తన కొడుకు రాఘవరెడ్డి టిడిపిలో చేరుతున్నట్టు ప్రకటించారు. తన కొడుకు మాగుంట రాఘవరెడ్డికి టిడిపి ఒంగోలు పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశామని ఎంపి మాగుంట తెలిపారు. మరోవైపు పార్టీలకు అతీంతంగా అందరితో కలిసిమెలిసి పనిచేసుకునే మంచి వ్యక్తి మాగుంట శ్రీనివాసులురెడ్డి టిడిపిలో చేరుతున్నందున ఆనందంగా ఉందని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..