Mystery Disease: పశ్చిమగోదావరి జిల్లాలో భయాందోళనకు గురిచేస్తోన్న వింత వ్యాధి.. తాజాగా ఒకరు మృతి..!
Unidentified Disease: పశ్చిమగోదావరి జిల్లా పూళ్ల గ్రామంలో వింత వ్యాధి జనాన్ని భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటి వరకు 36 మంది..
Mystery Disease: పశ్చిమగోదావరి జిల్లా పూళ్ల గ్రామంలో వింత వ్యాధి జనాన్ని భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటి వరకు 36 మంది ఈ వింత వ్యాధి బారినపడి చికిత్స పొందుతున్నారు. అయితే ఇప్పుడు ఓ వ్యక్తి చనిపోవడం కలకలం రేపుతోంది. అయితే ఆయన చావుకు వింత వ్యాధికి సంబంధం లేదని వైద్యులు చెబుతుండగా, స్థానికులు మాత్రం వింత వ్యాధి వల్లేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
బత్తిన బుల్లబ్బాయ్ అనే వ్యక్తి పొలం పనులకు వెళ్లి పొలం పక్కనే ఉన్న పంట బోదిలో పడి చనిపోయాడు. అయితే అతడిని పరీక్షించిన వైద్యులు హార్ట్ ఎటాక్తో చనిపోయాడని చెప్పారు. దీనిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా చాలా మంది గ్రామంలో ఫిట్స్తో కిందపడిపోతున్నారని, ఇప్పుడు బుల్లబ్బాయ్ కూడా వింత వ్యాధితోనే చనిపోయి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫిట్స్ వచ్చిన సమయంలో పక్కన ఎవరూ లేకపోతే చనిపోయే ప్రమాదం ఉందంటున్నారు. ఈ వింత వ్యాధి ఏమిటో త్వరగా చెప్పాలని, లేదంటే ఇంకా ఎంత మంది ప్రాణాలు పోతాయోనని ఆందోళన చెందుతున్నారు గ్రామస్తులు.
మరోవైపు ఈనెల 7వ తేదీన జాన్ అనే వ్యక్తి కూడా ఇదే విధంగా పంట బోదిలో పడి మృతి చెందాడు. గత మూడు రోజులుగా పొలం పనులకు వెళ్లిన రైతులు ఈవిధంగానే పంట పొలాల్లో కుప్పకూలిపడిపోతున్నారు. అయితే ఆ సమయంలో పక్కనే ఎవరైనా ఉంటే బాధితులను ఆసుపత్రికి తీసుకెళుతున్నారు. ఒకవేళ ఒంటరిగా వెళితే పరిస్థితి ఏంటనే ఆందోళన మొదలైంది. ఈ వింత వ్యాధికి కారణమేంటి ? అనేది త్వరగా తేల్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేదంటే ఎంత మంది చావులు చూడాల్సి వస్తుందోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also read:
Jobs in Singareni : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సింగరేణిలో 372 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల