Godavari: గోదావరికి వరద పెరుగుతోంది.. అప్రమత్తంగా ఉండండి.. అధికారుల కీలక ప్రకటన
గోదావరికి వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, పోటెత్తుతున్న ఉపనదులతో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద ముంపు ప్రభావిత..
గోదావరికి వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, పోటెత్తుతున్న ఉపనదులతో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద ముంపు ప్రభావిత మండలాల డా.బీఆర్.అంబేడ్కర్ విపత్తుల సంస్థ అలర్ట్ చేసింది. వరద ఉద్ధృతిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9.36 లక్షల క్యూసెక్కులుగా నమోదైనట్లు తెలిపారు. ఇవాళ మధ్యాహ్నానికి ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారిచేసే అవకాశం ఉంది. సహాయక చర్యలకోసం ఏపీలోని అల్లూరి జిల్లా కూనవరం, వీఆర్ పురంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం, స్నానాలకు వెళ్లడం వంటివి చేయకూడదని అధికారులు సూచించారు.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 45 అడుగులకు చేరింది. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని పలు గ్రామాల్లో వరద చేరింది. రహదారులు నీట మునిగాయి. రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి, శబరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నదులు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. మంగళవారం సాయంత్రానికి కూనవరంలో గోదావరి నీటి మట్టం 42 అడుగులు దాటింది. దేవీపట్నం వద్ద గోదావరి ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. పోశమ్మగండి వద్ద గండిపోశమ్మ ఆలయం పూర్తిగా నీట మునిగింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయాలి..