విజయవాడ, జనవరి 30: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ఆమె హైదరాబాద్ నుండి గన్నవరానికి ఇండిగో విమానంలో బయలుదేరారు. గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్న ఈ విమానంలో ల్యాండింగ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. సరిగ్గా విమానం ల్యాండింగ్ సమయంలో వీల్ తెరుచుకోలేదు. విషయాన్ని తెలుసుకున్న పైలట్ విమానాన్ని మళ్లీ టేకాఫ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కాసేపు గాల్లో ఎగిరిన తరువాత తిరిగి వీల్ బయటకు రావడంతో సేఫ్ ల్యాండింగ్ చేశారు పైలట్. ఈ విమానంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో పాటు అధికారులు, ప్యాసింజర్లు ప్రయాణించారు. పైలట్ అప్రమత్తమై ప్రమాదం నుంచి తప్పించడంతో అందులో ప్రయాణిస్తున్న వారు ఊపిరిపీల్చుకున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుకు తృటిలో విమాన ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు హెలికాప్టర్లో అరకు బయలు దేరగా.. సాంకేతిక సమస్య కారణంగా బాబు ప్రయాణిస్తోన్న హెలికాఫ్టర్ రాంగ్ డైరెక్షన్లో ప్రయాణం చేసింది. వెంటనే ఏటీసీ పైలెట్ను అప్రమత్తమం చేయడంతో బాబుకు పెను ప్రమాదం తప్పింది. ఇదిలా ఉంటే నారా చంద్రబాబు, ఆయన సతీమణికి ప్రమాదాలు తృటిలో తప్పుతున్నాయి. సోమవారం రాజమండ్రి సభలో చంద్రబాబు వేదిక నుంచి కిందకు పడబోయారు. సెక్యూరిటీ అప్రమత్తమవడంతో పెను ప్రమాదం తప్పింది. లేకుంటే వేదికనుంచి కిందపడిపోయేవారు. ఈ ఘటన మరువక ముందే భువనేశ్వరి ప్రయాణిస్తున్న విమానంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..