బీసీల అభివృద్ధికై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాటుపడుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. బీసీ అభ్యున్నతికై ఏలూరులో ఇచ్చిన మాటను సీఎం జగన్ నేడు నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. గురువారం నాడు విజయవాడలో బీసీల సంక్రాంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 56 కార్పొరేషన్ల చైర్మన్లు, 672 మంది డైరెక్టర్లు ఒకేసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి అనిల్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. ముఖ్యమంత్రి జగన్ను ప్రశంసలతో ఆకాశానికెత్తారు. బ్యాక్ వర్డ్ క్యాస్ట్ కాదు.. బ్యాక్ బోన్ క్యాస్ట్గా సీఎం జగన్ బీసీలను బలపరిచారని పేర్కొన్నారు. మెనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను సీఎం జగన్ నిలబెట్టుకున్నారన్న ఆయన.. బీసీ కులాల సమస్యలు పరిష్కరించుకునే వేదికను కల్పించారని అన్నారు. ‘మనకు ఎవరు అండగా ఉంటారో వారికి వెన్నుదన్నుగా ఉండే వాళ్ళమే బీసీలం’ అంటూ అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. అర్ధశాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశాలు కల్పించారని సీఎం జగన్ను కొనియాడారు. అందరూ మాటల చెప్పారు కానీ.. చెప్పిన మాటలను చేసి చూపించిన ఏకైక నాయకుడు సీఎం జగన్ మాత్రమే అని ఉద్ఘాటించారు. యువకులకు అవకాశం ఇచ్చిన సీఎం జగన్కు, వైఎస్ఆర్సీపీకి బీసీలు వెన్నెముకగా నిలుస్తారని మాటిస్తున్నానని మంత్రి అనిల్ పేర్కొన్నారు.
Also read:
వారొక్కరే ఆందోళన చేస్తున్నారు.. రైతు ఆందోళనలపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్..