Atchannaidu : ‘కులం చూడం.. మతం చూడం..’ అని చెప్పి ఇలాంటి చర్యలకు పాల్పడ్డం మీకే చెల్లింది : అచ్చెన్నాయుడు
వాళ్లకు కనీసం త్రాగునీరు కూడా ఇవ్వకుండా కక్ష్య సాధింపు చర్యలకు జగన్ పాల్పడుతున్నారని..
Atchannaidu comments on AP CM YS Jagan : కులం చూడం.. మతం చూడం అని చెప్పి హేయమైన చర్యలకు పాల్పడ్డం ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికే చెల్లిందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఇతర పార్టీల వాళ్లకు కనీసం త్రాగునీరు కూడా ఇవ్వకుండా కక్ష్య సాధింపు చర్యలకు జగన్ పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీకి ఓట్లు వేశారని నీళ్లు, ఫించన్, రేషన్ ఆపి వేయడం జగన్ ఫ్యాక్షన్ మనస్తత్వనికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా పెద్ద కడుబూరు మండం బసలదొడ్డి లో టీడీపీ సానుభూతి పరులకు తాగునీరు నిలిపివేయడం దుర్గార్మమైన చర్యగా ఆయన అభివర్ణించారు.
ముఖ్యమంత్రి.. పాలన గాలి కొదిలి టీడీపీకి ఓట్లేసిన వారికీ సంక్షేమ పథకాలు ఆపి వేస్తూ, మరో వైపు కొవిడ్ సమయంలో కూడా టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ రాక్షసానందం పొందుతున్నారని కింజరపు ఆరోపించారు. వివాదరహితుడైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి పై అకారణంగా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపి వేదిస్తున్నారని విమర్శించారు. 2 ఏళ్ల పాలనలో దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, కక్ష్య సాధింపు చర్యలు తప్ప, మీరు సాధించిన ప్రగతి ఏంటి? అని సీఎం జగన్మోహన్ రెడ్డిని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
“టీడీపీ హయాంలో అభివృద్ధి లో ముందున్న రాష్ట్రాన్ని అక్రమ కేసులు, అరాచకాలతో ఆంధ్రప్రదేశ్ ని అక్రమ అరెస్టుల ఆంధ్రప్రదేశ్ గా మార్చారు.. రాజారెడ్డి రాజ్యాంగానికి మరో 3 సంవత్సరాలే వ్యాలీడిటి, టీడీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి జగన్ , వైసీపీ నేతలు ప్రతి రోజూ పచ్చత్తాపపడక తప్పదు.” అంటూ అచ్చెన్న వైసీపీ సర్కారుకి వార్నింగ్ ఇచ్చారు.