ఏపీలో ఉద్యోగుల కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్పై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సమావేశం.. ఉద్యోగ సంఘాలకు సమాచారమిచ్చిన ఆర్థిక శాఖ..
ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ - సీపీఎస్ అంశంపై చర్చలకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను ఆహ్వానించింది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్..
ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ – సీపీఎస్ అంశంపై చర్చలకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను ఆహ్వానించింది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈ చర్చలు జరపనున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రంలోని 20 ఉద్యోగ సంఘాల నేతలకు, ప్రతినిధులకు ఆర్థిక శాఖ సమాచారం పంపించింది. ప్రధాన ఉద్యోగ సంఘాలతో పాటు ఉపాధ్యాయ సంఘాలు, సీపీఎస్ ఉద్యోగుల అసోసియేషన్లనూ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. సీపీఎస్పై ఏర్పాటైన మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించనుంది. సీపీఎస్ అంశంపై చర్చించేందుకు మాత్రమే రావాలని ఆర్థిక శాఖ ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేసింది. అంటే ఈ సమావేశంలో సీపీఎస్ అంశం తప్పితే.. ఇతర ఉద్యోగుల సమస్యల గురించి చర్చించే అవకాశం ఉండకపోవచ్చు. ముందుగానే ఆర్థిక శాఖ పంపిన నోట్లో ఈ విషయం స్పష్టం చేసింది.
ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విషయంలో ప్రభుత్వం గతంలోనూ పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. గతంలో ఈ పథకం రద్దు సాధ్యం కాదని ప్రభుత్వం చెప్పింది. అదే సమయంలో ఎన్నికల ముందు వైసీపీ ఇచ్చిన 100 హామీల్లో సీపీఎస్ ఒకటని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం గతంలో చెప్పారు.
ఈ హామీని నెరవేర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు గత సెప్టెంబర్లో వెల్లడించారు. దీనిపై తుది నిర్ణయాన్ని రెండు నెలల్లో వెల్లడిస్తామన్నారు. అంతే కాకుండా ఉద్యోగుల క్రమబద్ధీకరణను ఈ ఏడాది చివరి నాటికి పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్పై చర్చించేందుకు ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..