Telangana: తెలంగాణకు రెడ్ అలెర్ట్.. భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
Telangana Rains: ఉత్తర ఒడిశా దాని పరసర ప్రాంతాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు స్టేట్స్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Telangana Weather: తెలుగు రాష్ట్రాలు ముసురుపట్టాయి. మరో రెండు రోజులపాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాలకు ఆవర్తనాలు, అల్పపీడనం తోడు కావడంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. దీంతో ఏపీ(Andhra Pradesh), తెలంగాణ(Telangana), కర్ణాటక, కేరళ(Kerala), మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిషా, చత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. తెలంగాణలో శని, ఆదివారాల్లో రెడ్ అలర్ట్, ఆ తరువాత రెండు రోజులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామని వెల్లడించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు సాధారణం కన్నా 45శాతం ఎక్కువగా వర్షపాతం నమోదైందని వివరించింది. కాగా ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. భాగ్యనగరాన్ని ముసురు వదలడం లేదు రాత్రి పగలూ…ఎడతెరిపి లేకుందడా వర్షం కురుస్తోంది. ఆఫీస్లు, సూళ్లకు వెళ్లే సమయంలో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు అత్యధికంగా నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కొండూరులో 186 మిల్లిమీటర్ల వర్షం కురిసింది.
ఎడతెరిపి లేని వానలతో మెట్రో రైల్లో ప్రయాణికులు పోటెత్తారు. గత రెండు మూడు రోజులుగా హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. వర్షపు నీరంతా మూసి నదికి భారీగా వరదలా వచ్చి చేరుతోంది. హైదరాబాద్ని కుండపోత వర్షం ముంచెత్తింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. నాలాలు పొంగిపొర్లాయి. మాదాపూర్, గచ్చిబౌలి, చందానగర్, పటాన్ చెరు ప్రాంతంలో కూడా భారీ వర్షం కురిసింది. అంబర్పేట్, నల్లకుంట, నాచారం, ఓయూ, ఉప్పల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, నాంపల్లి, ఖైరతాబాద్ ఏరియాలోనూ ఏకధాటిగా వర్షం కురిసింది. రామంతపూర్లో అత్యధికంగా 7.1 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. మాదాపూర్ 5.4, డబిర్పురలో 5.1 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.
మరోవైపు వర్షం కారణంగా పలుచోట్ల ట్రాఫిక్కి అంతరాయం కలిగింది. కొన్నిచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం నెలకొంది. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దాంతో DRF, జీహెచ్ఎంసీ బృందాలు రంగంలోకి దిగాయి. మరో 2 రోజుల పాటు హైదరాబాద్ సిటీకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు రోజులపాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వార్నింగ్ ఇచ్చింది. తెలంగాణలోని 14 జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది. జంటనగరాల ప్రజలు మరింత అలర్ట్గా ఉండాలని… అవసరమైతేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని స్పష్టం చేసింది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) July 8, 2022