Kona Raghupathi: ఎంతో మంది ముఖ్యమంత్రులు ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.. ఆయన మాత్రమే ప్రారంభించారు: కోన రఘుపతి
Kona Raghupathi: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వరం అని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి..
Kona Raghupathi: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వరం అని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి అన్నారు. ఆదివారం నాడు ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై ఎస్ఈ నాగిరెడ్డి, మేఘా ఇంజనీరింగ్ జనరల్ మేనేజర్ సతీష్ అంగర, మురళి పమ్మి లను అడిగి తెలుసుకున్నారు. అనంతం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంతో మంది ముఖ్యమంత్రులు పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు కానీ.. పోలవరం ప్రాజెక్టును ప్రారంభించింది మాత్రం రాజశేఖర్ రెడ్డి అని పేర్కొన్నారు. ముందుచూపుతో కాల్వలను తవ్వించడం ద్వారా పనులు ముందుకు సాగుతున్నాయని అన్నారు. ప్రాజెక్టు లేకుండా కాలువలు తవ్వుతున్నారని అప్పట్లో ప్రతిపక్ష నేతలు ఎద్దేవా చేశారని గుర్తు చేసిన ఆయన.. ఆ కాలువల ద్వారానే ఇప్పుడు నీరు తరలించడం జరుగుతుందన్నారు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారని కొంత మంది వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కోన రఘుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్ ప్రకారమే పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ప్రాజెక్టు ఎత్తులో ఒక్క అంగుళం కూడా తగ్గించడం లేదని ఉద్ఘాటించారు. అప్పట్లోనే భూసేకరణ చేయడం వల్ల ఇప్పుడు ఖర్చు తగ్గుతుందని కోన రఘుపతి అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు పనుల గురించి తెలుసుకోవాలని భావించి నేడు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చానని ఆయన వివరించారు. అనుకున్న ప్రకారం ప్రభుత్వం పోలవరం పూర్తి చేస్తుందని పూర్తి నమ్మకంతో ఉన్నాయని ఉపసభాపతి తెలిపారు.
Also read: