CM Jagan: ఇలాంటివారిని ఏమందాం.. కొడుక్కి అబద్ధాలు, మోసాలతో ట్రైనింగ్ ఇస్తున్నాడు..చంద్రబాబుపై సీఎం జగన్ వ్యంగ్యాస్త్రాలు
రాష్ట్రద్రోహులు అందామా? దేశ ద్రోహులు అందామా? 27 ఏళ్లు చంద్రబాబు కుప్పంకు ఎమ్మెల్యేగా ఉన్నారు? ఏ రోజూ కూడా కుప్పంలో ఇల్లు కట్టుకుందామన్న ఆలోచన ఆయన చేయలేదు? మీ జగన్ పరిపాలన 3 ఏళ్లు చూశాడో లేదో కుప్పంకు పరిగెత్తుకుని..
చంద్రబాబు(Chandrababu) పాలనలో మత్స్యకారులను పట్టించుకోలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(CM Jagan) విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ పాలనకు.. మన ప్రభుత్వ పాలనకు తేడా గమనించాలని కోరారు. కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్ళలో నాలుగో ఏడాది వైఎస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి వారిని రాష్ట్రద్రోహులు అందామా? దేశ ద్రోహులు అందామా? 27 ఏళ్లు చంద్రబాబు కుప్పంకు ఎమ్మెల్యేగా ఉన్నారు? ఏ రోజూ కూడా కుప్పంలో ఇల్లు కట్టుకుందామన్న ఆలోచన ఆయన చేయలేదు? మీ జగన్ పరిపాలన 3 ఏళ్లు చూశాడో లేదో కుప్పంకు పరిగెత్తుకుని వెళ్లి మరీ ఇల్లు కట్టుకుంటున్నాడు అంటూ వ్యంగ్యాస్త్రాలు సందించారు. మంచి చేశామని మనలా చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు. అంతేకాదు మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ఆయన జీర్ణించుకోలేరు. ఏదైనా వ్యాధికి ఆరోగ్యశ్రీలో చికిత్స చేయించుకోవచ్చు.. కానీ ఈర్ష్య, కడుపు మంటకు వైద్యం లేదు. కొడుక్కి పచ్చి అబద్ధాలు, మోసాలతో ట్రైనింగ్ ఇస్తున్న చంద్రబాబు లాంటి తండ్రిని ఎక్కడైనా చూశారా? కోర్టుకి వెళ్లి మంచి పనులు అడ్డుకునే ప్రతిపక్షాన్నిఎక్కడైనా చూశారా? పరీక్షల పేపర్లు వీళ్లే లీక్ చేస్తారు.. పేపర్ లీక్ను సమర్థించిన ప్రతిపక్షాన్ని ఎక్కడైనా చూశారా? అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు.
మనం చేయదగ్గ మంచిని చరిత్రలో ఎవ్వరూ చేయని విధంగా ప్రజలకు చేశాం.. చేస్తున్నాం అని అన్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి ఇంకా ఎంతో మంచి చేయాలన్న ఆలోచన దేవుడు ప్రజలకు ఇవ్వాలని కోరుతున్నాను అంటూ అభిప్రాయ పడ్డారు. వక్రబుద్ధి ఉన్న నాయకుల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలన్నారు.
అయితే.. మత్స్యకారుల కష్టాలను పాదయాత్రలో దగ్గరగా చూశాను. వరుసగా నాలుగో ఏడాది కూడా మత్స్యకార భరోసా అమలు చేస్తున్నాం. ఒక్కో కుటుంబానికి రూ.10వేల చొప్పున సాయం అందిస్తున్నాం. 1,08,755 మంది మత్స్యకారులకు రూ.109 కోట్లు జమ చేస్తున్నాం. మత్స్యకార భరోసా కింద ఇప్పటివరకు రూ.418 కోట్ల సాయం అందించాం. వేట కోల్పోయిన 23,458 మంది మత్స్యకారులకు ఓన్జీసీ పరిహారం అందిస్తున్నాం.
జీవనోపాధి కోల్పోయిన 69 గ్రామాల మత్స్యకార కుటుంబాలకు రూ.11,500 చొప్పున 4 నెలలపాటు ఓన్జీసీ చెల్లించిన రూ.108 కోట్ల పరిహారం అందిస్తున్నాం. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.217 కోట్లు జమ చేస్తున్నాం. గత ప్రభుత్వం బకాయిపెట్టిన 70 కోట్లను మన ప్రభుత్వమే చెల్లించిందన్నారు సీఎం జగన్.