Andhra Pradesh: కోవిడ్ వల్ల చనిపోయిన పోలీసుల కుటుంబాలకు రూ 10 లక్షలు మంజూరు

విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. 

Andhra Pradesh: కోవిడ్ వల్ల చనిపోయిన పోలీసుల కుటుంబాలకు రూ 10 లక్షలు మంజూరు
Cm Jagan
Follow us

|

Updated on: Oct 21, 2021 | 11:57 AM

విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు.  అమరవీరుల పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం.. సీఎం  పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.  అమరులైన పోలీసుల కుటుంబసభ్యులకు ఆర్దిక సాయం అందించారు.

ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే….:

పోలీసు అధికారులకు, ప్రతి ఉద్యోగికి, మీ కుటుంబ సభ్యులందరికీ నా అభినందనలు. ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల దినం దేశం మొత్తం జరుపుకుంటుంది. 1959లో అక్టోబరు 21న చైనా సైనికులను ఎదురించి పోరాడిన ఎస్సై కరణ్‌ సింగ్‌ ఆయన సహచరుల ధైర్యాన్ని, త్యాగాన్ని అమరవీరుల సంస్మరణదినోత్సవంగా మన దేశం గత 62 యేళ్లుగా గుర్తు చేసుకుంటుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల సేవలో ప్రాణాలు వదిలిన ప్రతి పోలీసుకు, ప్రతి పోలీసు కుటుంబానికి మొత్తం సమాజం కూడా జేజేలు పలుకుతోంది.

అమరులకు శ్రద్ధాంజలి

గత ఏడాది కాలంగా దేశ వ్యాప్తంగా 377 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులైతే అందులో 11 మంది మన రాష్ట్రానికి చెందినవారు. ఇలా గత ఏడాది కాలంలో మరణించిన పోలీసు సోదరుడుకి, సోదరికి ఈ అమరవీరులందరికీ నేడు నా తరపున మన రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేస్తున్నాను. అధికారం చేపట్టిన నాటి నుంచి సమాజం పట్ల బాధ్యతతో పరిపాలన సాగుతుంది. సమాజం పట్ల బాధ్యతలు నిర్వహిస్తున్న పోలీసులు పట్ల కూడా మనందరి ప్రభుత్వంగా అదే చిత్తశుద్ధిని, బాధ్యతను చేతల్లో కూడా చూపిస్తూ వచ్చాం.

దేశంలో పోలీసులకు తొలిసారి వీక్లీఆఫ్‌…

పోలీసులు తమ కుటుంబాలతో గడపాలని వారికి తగినంత విశ్రాంతి ఉండాలని ఎప్పుడూ, ఎవరూ కూడా గతంలో ఆలోచన సైతం చేయని విధంగా వారి బాగోగులు కోసం ఆలోచించి దేశంలో ఎక్కడా జరగని విధంగా మొట్టమొదటిసారిగా వీక్లీ ఆఫ్‌ని ప్రకటించిన మొట్టమొదటి ప్రభుత్వం మనదే అని ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తున్నాను. కోవిడ్‌ వలన గత కొంత కాలంగా ఇది అమలు చేయలేకపోయినప్పటికీ కూడా కోవిడ్‌ తగ్గుముఖం పడుతున్న నేపధ్యంలో మరలా ఈ వీక్లీఆఫ్‌ పోలీసులకిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతున్నాం.

పోలీసు సంక్షేమం – భారీగా ఉద్యోగ నియామకాలు…

అదే విధంగా పోలీసు సంక్షేమానికి గత ప్రభుత్వం 2017 నుంచి బకాయిలు పెట్టిన రూ.15 కోట్లు నిధులు కూడా వారికి విడుదల చేసిన ప్రభుత్వం మనదే అని తెలియజేస్తున్నాను. పోలీస్‌ శాఖ సిబ్బంది కొరతను భర్తీ చేయడానికి భారీగా ఉద్యోగ నియామకాలను కూడా చేపట్టబోతున్నాం. పోలీస్‌ శాఖకు అనుసంధానంగా ఉన్న హోంగార్డుల గౌరవవేతనం కూడా మన హయాంలోనే పెంచడం జరిగింది. రాష్ట్రంలో అక్కచెల్లెమ్మల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ…. పోలీసు శాఖలో 16 వేల మంది మహిళా పోలీసులను గ్రామ, వార్డు సచివాలయాల స్ధాయిలోనే నియమించడం జరిగింది. వారందరికీ శిక్షణా కార్యక్రమం కూడా మొదలవుతుంది.

ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లుకు అండగా…

కరోనా మీద పోరాటం చేస్తూ ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లుగా ప్రాణాలు అర్పించిన పోలీసు కుటుంబాలకు కూడా మన ప్రభుత్వం అండగా నిల్చింది. కరోనా వల్ల మృతి చెందిన పోలీసు కుటుంబాలకు పోలీసు శాఖ నుంచి రూ.5 లక్షలు మంజూరు చేస్తే.. దానికి మ్యాచింగ్‌ గ్రాంట్‌గా మరో రూ.5 లక్షలు రాష్ట్రప్రభుత్వం నుంచి మంజూరు చేయమని ఆదేశాలు జారీ చేశాం. కరోనా బారిన పడిన పోలీసులకు, వారి కుటుంబాలకు ప్రత్యేక వైద్య సేవలు అందించడం, కరోనాతో మృతి చెందిన సిబ్బంది కుటుంబాలకు దేశంలో ఎక్కడా లేని విధంగా ఎక్స్‌గ్రేషియా ఇతర సదుపాయాలని అందించి పోలీసు కుటుంబాలను ఆదుకున్నాం.

కారుణ్య నియామకాలు…

కరోనాతో మృతి చెందిన పోలీసు మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగాల కుటుంబాలకు కూడా ఊరటనిస్తూ కారుణ్య నియామకాలు అన్నీ కూడా నిర్ణీత కాలపరిమితితో నవంబరు 30 తేదీలోగా గడువుపెట్టి మరీ పూర్తి చేయాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. అదే విధంగా అక్కచెల్లెమ్మల భద్రత కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా దిశ యాప్, దిశ పోలీస్‌ స్టేషన్లు, దిశ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకం చేపట్టిన విషయం మీకు తెలిసిందే. దిశ బిల్లుపై మనం చేయగలిగిన ప్రతి ప్రయత్నం పూర్తి చేస్తూ ఉభయ సభలు ఆమోదించి, కేంద్రానికి వారి ఆమోదం కోసం ఇప్పటికే పంపించాం.

బాలికలు, మహిళల రక్షణ చర్యలు– జాతీయ స్దాయిలో ప్రశంసలు.

బాలికలు, మహిళ సంరక్షణకోసం మహిళా మిత్ర, సైబర్‌ మిత్ర కార్యక్రమాలను వార్డు, గ్రామ స్ధాయిలోకి తీసుకువెళ్లాం. మహిళా హోం మంత్రి ఆధ్వర్యంలో పటిష్టంగా అమలు చేస్తున్న ఈ రక్షణ చర్యలకు జాతీయ స్ధాయిలో ప్రశంసలు, పురష్కారాలు కూడా లభించాయి.

మరికొన్ని విషయాలు మీ ముందుంచాలి…

ఇక్కడ మరికొన్ని విషయాలను కూడా ఈ సందర్భంగా ప్రజల ముందుంచాలి. మారుతున్న సమాజంలో, మారుతున్న టెక్నాలజీతో క్రైం ఇన్వెస్టిగేషన్‌ నుంచి సైబర్‌ క్రైం ఇన్వెస్టిగేషన్‌ వరకు పోలీసుల భాధ్యతలు విస్తరించడం మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి. చీకటి ప్రపంచం చేసే నేరాలతో పాటు వైట్‌ కాలర్‌ నేరాలను కూడా నిరోధించడం, జరిగిన నేరాలను విచారించడం వరకు పోలీసు విధులు విస్తరించాయి. మన గడ్డమీద ఉండి ఇక్కడే నేరం చేసినవారితో పాటు సరిహద్దులు లేకుండా రాష్ట్రం అవతల, వేరే దేశాల నుంచి కూడా మన గడ్డమీద ఉన్న ప్రజలను, సంస్ధలను, ప్రభుత్వాలను టార్గెట్‌ చేసే నేరగాళ్లను వారి చేసే నేరాలను కూడా ఈ రోజు మన పోలీసు శాఖ డీల్‌ చేయాల్సి వస్తోంది. అంటే నేరం ఎప్పటికప్పుడు కొత్త, కొత్త రూపాల్లో దాడి చేస్తుంది.

నేరాల కొత్త రూపాలను చూస్తున్నాం…

నేరాలకు సంబంధించి ఇలాంటి మరో కొత్త రూపాన్ని కూడా ఈ మధ్య కాలంలో మనమంతా మన రాష్ట్రంలో చూస్తున్నాం. గత రెండున్నరేళ్లుగా ఈ కొత్త కోణం, కొత్త నేరగాళ్లను మన రాష్ట్రంలో చూస్తున్నాం. వీరు ఎలాంటి పనులు చేశారో కూడా మన కళ్లెదుటనే కనిపిస్తున్నాయి. అధికారం దక్కలేదని చీకట్లో విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. అధికారం దక్కలేదని చీకట్లో ఆలయాలకు సంబంధించిన రధాలను తగలబెడుతున్నారు. కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. అధికారం దక్కలేదనే మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఏ మాత్రం కూడా సంకోచించడం లేదు. అధికారం దక్కలేదని సంక్షేమ పథకాలను అడ్డుకోవడానికి కోర్టుల్లో కేసులు వేయించి ఇళ్ల నిర్మాణాలను ఆపిన సంఘటనలు కూడా మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి.అధికారం దక్కలేదని చివరకు పేదపిల్లలకు ఇంగ్లిషుమీడియం చదువులు అందడానికి కూడా వీల్లేదని అంటున్నారు.

అబద్దాలనే డిబెట్లుగా….

చివరకి మా వాడు అధికారంలోకి రాకపోతే ప్రతిరోజూ అబద్దాలే వార్తలుగా, వార్తా కథనాలుగా మేము ఇస్తాం. అబద్ధాలనే డిబెట్లుగా ప్రతిరోజూ నడుపుతామని అంటున్న పచ్చ పత్రకలు, పచ్చ ఛానెళ్లను కూడా మన కళ్లెదుటే చూస్తున్నాం.

ముఖ్యమంత్రిని కూడా….

మా వాడు అధికారంలో లేకపోతే ముఖ్యమంత్రిని కూడా బోసిడీకే అని.. బూతులు వాడుతున్నారు. ముఖ్యమంత్రి అంటే కానిస్టిట్యూషనల్‌ హెడ్‌.. అలాంటి ముఖ్యమంత్రిని, వాళ్ల తల్లినుద్దేశించి మాట్లాడుతున్న మాటలు, బూతులు తిట్టడాన్ని కూడా ఈ రోజు చూస్తున్నాం.

ఇలా తిట్టడం కరెక్టేనా….

ఇది కరెక్టేనా.. ఇలా తిట్టడం కరెక్టేనా.. ఇలా తిట్టినందుకు ముఖ్యమంత్రిగారిని అభిమానించేవాళ్లెవరైనా తిరగబడాలి, వాళ్లు రెచ్చిపోవాలి, రాష్ట్రంలో భావోద్వేగాలు పెరగాలి. దానివల్ల గొడవలు సృష్టించాలని ఆరాట పడటం.. ఇదంతా సమంజసమేనా అని ఒక్కసారి అందరూ ఆలోచన చేయాలి. ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఇవాళ చూస్తున్నాం.

రూపం మార్చుకున్న యాంటీ సోషల్‌ ఎలిమెంట్స్‌….

రూపం మార్చుకున్న యాంటీ సోషల్‌ ఎలిమెంట్స్‌ను అంటే అసాంఘిక శక్తులు… రాజకీయ నాయకులుగా కూడా మనం చూస్తున్నాం. తాము గెలవలేదు కాబట్టి, తమవాడు గెలవలేదు కాబట్టి, తమకు గిట్టని మనిషి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నాడు కాబట్టి రెండేళ్ల తర్వాత జరిగిన మున్సిపల్, కార్పొరేషన్‌ ఎన్నికలైతేనేమి, జెడ్పీటీసీ, మండల ఎన్నికలు, చివరకి ఉప ఎన్నికల్లో కూడా అధికార పార్టీ పాలనను మెచ్చుకుంటూ ప్రజలు అఖండ విజయం అందించారు కాబట్టి, ఇక తమకు అధికారం దక్కే అవకాశం లేదు కాబట్టి ఇలా చేస్తున్నారు.

రాష్ట్ర ప్రతిష్టనూ దిగజారుస్తున్నారు….

చివరకు మన రాష్ట్రం పరువు, ప్రతిష్టలను కూడా దిగజారుస్తూ డ్రగ్స్‌ ఆంధ్రప్రదేశ్‌ అని చెప్పి వీరంతా జరగనిది జరిగినట్టుగా పచ్చి అబద్దాన్ని సైతం గ్లోబెల్స్‌ ప్రచారం మాదిరి రోజూ అబద్దాలే చెబుతూ మన రాష్ట్రం మీద, మన రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు మీద కూడా ఒక కళంకమైన ముద్రవేయడం చూస్తున్నాం. వీరు టార్గెట్‌ చేస్తున్నది మీ ముఖ్యమంత్రిని, మనందరి ప్రభుత్వాన్నే మాత్రమే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం మీద, ప్రతి ఒక్కరిమీదా వీరు చేస్తున్న దాడి.

అక్కసుతో.. అనైతిక ప్రచారం….

మన పిల్లలను కూడా డ్రగ్‌ అడిక్ట్స్‌గా ప్రపంచానికి చూపించే దుర్మార్గమైన ప్రయత్నం జరుగుతుంది. ఇది అత్యంత తీవ్రమైన నేరం. ఇది అనైతికం, అధర్మం, ఒక పచ్చి అబద్దం అని ఏకంగా సాక్షాత్తూ సెంట్రల్‌ గవర్నమెంటుకు చెందిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ వివరణ ఇచ్చినా కూడా, విజయవాడ సిటీ పోలీస్‌ కమిషనర్‌ ఆ వివరణను చూపిస్తూ మళ్లీ చెప్పినా.. చివరకు డీజీపీ పదే, పదే ఇదే విషయం, ఇవి అబద్దాలు అని చెప్పినా కూడా లెక్కలేనితనంతో, కేవలం అక్కసుతో ఒక పథకం ప్రకారం క్రిమినల్‌ బ్రెయిన్‌తో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు.మన రాష్ట్రం పరువు, ప్రతిష్టలను, ఇక్కడ పిల్లలు, ప్రజల భవిష్యత్తుపై ఒక కళంకిత ముద్రవేసి దెబ్బతీయాడనికి సిద్దపడ్డారు.

పౌరుల రక్షణలో రాజీ పడొద్దు….

ఇటువంటి పరిస్థితుల్లో పోలీసులందిరికీ నేను చెప్పగలిగేది ఒక్కటే.. శాంతి భద్రతలు మనకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. ఈ విషయంలో ఎవ్వరికి కూడా మినహాయింపు లేదు. నా వారు తనవారు అనే భేదం చూడవలిసిన పనిలేదు. శాంతి భద్రతల పరిరక్షణే అత్యంత ప్రాధాన్యాంశం. ప్రత్యేకించి మహిళలు, పిల్లలు, వృద్ధుల రక్షణతో పాటు మొత్తంగా పౌరులందరి రక్షణ, భద్రత విషయంలో పోలీసులు ఏమాత్రం రాజీపడొద్దని ప్రతి పోలీసు సోదరుడికీ గుర్తు చేస్తున్నాను.

బడుగు,బలహీన వర్గాల రక్షణ కోసం….

బడుగు, బలహీన వర్గాలవారి మీద కులపరమైన దాడులు, హింస ఎక్కడైనా జరిగితే.. కారకులను ఎవరైనా కూడా ఉపేక్షించొద్దు.. అలాంటి వారు ఎవరైనా కూడా చట్టం ముందర నిలబెట్టండని ప్రతి పోలీసుకు తమ విధిని గుర్తు చేస్తున్నాను. తీవ్రవాదాన్ని, ఆసాంఘిక శక్తులను, సంఘ విద్రోహ కార్యకలాపాలను ఏమాత్రం కూడా ఉపేక్షించొద్దని, ఈ విషయంలో పెద్దా చిన్నా అంటూ వేర్వేరుగా చూడాల్సిన అవసరం లేదని గతంలోనూ చెప్పాను, మరోక్కసారి చెబుతున్నాను.

చివరగా…

ఈ సందర్భంగా ఎల్లప్పుడూ మంచి చేస్తున్న మీ అందరికీ, మనందరి ప్రభుత్వానికీ దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనులు లభించాలని కోరుకుంటున్నాను అని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు.

ఈ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని), సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, ఇతర ప్రజా ప్రతినిధులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read: చివరకు సీఎం తల్లిని తిడుతున్నారు.. పట్టాభి బూతు వ్యాఖ్యలపై సీఎం జగన్ ఫైర్

జైలుకెళ్లి తనయుడు ఆర్యన్‌ను కలిసిన బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్