Nimmagadda: పరిషత్ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిమ్మగడ్డ మరో ట్విస్ట్.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఇప్పుడు నిర్వహించలేమని స్పష్టం
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఎన్నికల నిర్వహణపై మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈసీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఎన్నికల నిర్వహణపై మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈసీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో ట్విస్ట్ ఇచ్చారు. తన పదవీ కాలం పూర్తవుతుండటంతో ఎన్నికలను నిర్వహించలేనని తేల్చి తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు తన దగ్గర తగినంత సమయం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు షెడ్యూల్ జారీ చేయలేని పరిస్థితిలో ఉన్నానని రమేశ్ ఉత్తర్వులు ఇచ్చారు. నాలుగు వారాల ఎన్నికల కోడ్ విధించాలన్న బాధ్యతనూ నెరవేర్చలేనన్నారు. సిబ్బంది కరోనా టీకా వేయించుకోవడంలో నిమగ్నమయ్యారని ఎస్ఈసీ వివరించారు. ఈ పరిస్థితుల్లో షెడ్యూల్ జారీ చేయలేనని ఎస్ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 31 వరకు తన పదవీ కాలం పూర్తవుతుండటంతో బాధ్యతలను వేరే వారు నిర్వహిస్తారని.. ప్రస్తుత పరిస్థితుల్లో తాను షెడ్యూల్ విడుదల చేయలేనని స్పష్టం చేశారు. తన తదుపరి వచ్చే కమిషనర్ ఎన్నికలు నిర్వహిస్తారన్నారు. హైకోర్టు తీర్పు, ఎన్నికల కోడ్ కారణంగా నిర్వహించలేమని వెల్లడించారు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ఈ ఆదేశాలిస్తున్నామన్నారు.
ఏపీలో ఎన్నికల నిర్వహణలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు నిమ్మగడ్డ. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఏకగ్రీవాలు జరిగిన చోట ఫిర్యాదు చేసుకోవచ్చని.. దౌర్జన్యాలు, బెదిరింపులు, ప్రలోభాల కారణంగా నామినేషన్లు వేయలేకపోయినవారు రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పించారు. దీనిపై రిటర్నింగ్ అధికారులు విచారణ చేస్తారని చెప్పారు. గ్రామ పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీస్, ప్రభుత్వ యంత్రాంగం ఎంతో శ్రమకోర్చి పనిచేశారన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించిన అనంతరమే పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామన్నారు.
మరోవైపు, నిమ్మగడ్డ ప్రకటనతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడంలేదు. ఇటు మంగళవారం హైకోర్టులో కూడా ఎన్నికల నిర్వహణపై విచారణ జరిగింది. ఎన్నికలు వెంటనే జరపాలని తాము ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు వ్యాఖ్యానించింది. పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని దాఖలైన అనుబంధ పిటిషన్లను డిస్మిస్ చేసింది. ఎన్నికల నిర్వహణ విషయంలో జోక్యం చేసుకోలేమని.. ఎప్పుడు నిర్వహించాలనేది ఎస్ఈసీ నిర్ణయమని అభిప్రాయపడింది. ప్రధాన పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ఎస్ఈసీని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 30కు వాయిదా వేసింది.
Read Also… వైఎస్సార్ అనుచరుడు సూరీడుపై దాడి.. క్రికెట్ బ్యాట్తో కొట్టిన సొంత అల్లుడు.. కారణాలు ఇలా ఉన్నాయి..