AP Local Polls Controversy Live Updates: ఏపీలో తేలని లోకల్ ‘పంచాయితీ’.. మళ్లీ మొదటికే వచ్చిన ఎస్ఈసీ షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల బంతి మళ్లీ ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం కోర్టులోకి వెళ్లింది. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా ఆలోచించినప్పుడు ఎన్నికలు నిర్వహించడం సాధ్యంకాదన్న ప్రభుత్వ అభిప్రాయాన్ని హైకోర్టు సమర్ధించింది. ప్రజలు జీవించే ప్రాథమిక హక్కును గుర్తు చేసింది న్యాయస్థానం. తాజా తీర్పుతో ఎన్నికలు నిర్వహించాలన్న ఎస్ఈసీ నిర్ణయానికి బ్రేకులు పడ్డాయి. వ్యాక్సినేషన్కు ఎన్నికల ప్రక్రియ అడ్డొస్తుందని భావించిన ధర్మాసనం.. సరైన ఉద్దేశాలతో నిర్ణయం తీసుకోలేదని అభిప్రాయపడింది.
LIVE NEWS & UPDATES
-
నిమ్మగడ్డ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలిః మంత్రి అవంతి
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. నిమ్మగడ్డ టీడీపీ నేతలా వ్యవహరిస్తున్నారన్న మంత్రి.. హైకోర్టు తీర్పుపై నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ కారణంగారు ఎన్నికలు వాయిదా కోరామన్నారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా విజయం సాధిస్తామని మంత్రి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు.
-
కోర్టు ప్రజల పక్షాన తీర్పు చెప్పిందిః తమ్మినేని సీతారాం
అంబేద్కర్ రాసిన రాజ్యాంగ వ్యవస్థను కొందరు అపహాస్యం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలు దేశాన్ని కాపాడాలి కాని సంక్షోభం సృష్టించకూడదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేసే పనిలో నిమగ్నమైందని.. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సరైన నిర్ణయం కాదని చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయం బాధాకరమన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియంత్రత్వ ధోరణితో వెళ్తే ఎలా అని ప్రశ్నించిన స్పీకర్… న్యాయ స్థానం ప్రజల పక్షాన తీర్పు చెప్పిందన్నారు తమ్మినేని సీతారాం. పేర్కొన్నారు.
-
-
అరగంట పాటు గవర్నర్తో ఎస్ఈసీ చర్చ
అర్ధగంట పాటు గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్తో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సమావేశం సాగింది. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు. ఎస్ఈసీలోని ఉద్యోగులను ప్రభుత్వం ప్రభావితం చేస్తోందని గవర్నర్కు నిమ్మగడ్డ వివరించారు. తాజాగా ఎస్ఈసీ జాయింట్ డైరెక్టర్ నెల రోజుల పాటు సెలవుపై వెళ్లిన విషయాన్ని సైతం గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఉద్యోగులను ఎస్ఈసీకి సహకరించకుండా పరోక్షంగా ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందంటూ పిర్యాదు చేసినట్లు సమాచారం. వివిధ ఉద్యోగి సంఘాలు బహిరంగంగానే సహకరించేది లేదంటూ మీడియా సమావేశాలు పెట్టిన విషయాన్ని సైతం ఎస్ఈసీ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
-
ఎస్ఈసీ హౌస్ మోషన్ పిటిషన్పై హైకోర్టు విచారణ..
ఎస్ఈసీ హౌస్ మోషన్ పిటిషన్పై ఒంటి గంట తర్వాత విచారణ జరగనుంది. డివిజన్ బెంచ్ పిటిషన్ను విచారించనుంది.
-
గవర్నర్ దృష్టికి నోటిఫికేష్ తదనంతరం పరిణామాలు
గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్తో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సమావేశం ముగిసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు.. తాజా పరిణామాలపై గవర్కర్కు వివరించారు రమేష్ కుమార్. స్థానిక సంస్థలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చాననే విషయాన్ని గవర్నర్ దృష్టికి ఎస్ఈసీ తీసుకెళ్లారు. హైకోర్టులో జరిగిన పరిణామాలు.. తీర్పుపై అప్పీల్ చేసిన విషయాలను గవర్నర్కు వివరించారు.
-
-
గవర్నర్తో ఈసీ భేటి..
ఏపీ గవర్నర్ హరిచందన్తో ఈసీ నిమ్మగడ్డ రమేష్ భేటి పూర్తయింది. ఈ సమావేశం 40 నిమిషాల పాటు సాగింది. పంచాయితీ ఎన్నికల షెడ్యూల్పై నిమ్మగడ్డ గవర్నర్కు వివరణ ఇచ్చారు.
-
పంచాయితీ ఎన్నికలపై భిన్న స్వరాలు
స్థానిక సంస్థల ఎన్నికలకు తాము సిద్ధంగా లేమని చెప్పినా.. ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని జగన్ సర్కారు ఆరోపిస్తోంది. కరోనా ఉధృతి కొనసాగుతుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూలు జారీ చేయడంపై అధికార వైసీపీ ఫైర్ అవుతుండగా.. ఎన్నికల షెడ్యూల్ విడుదలను టీడీపీ, బీజేపీ స్వాగతించాయి.
-
ఉద్యోగులు సెలవుపై వెళ్లేలా ఎస్ఈసీ ప్రభావితం చేస్తున్నారుః ప్రభుత్వం
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వెలువరించిన ఎస్ఈసీ.. ఈ నెల 9వ తేదీ వరకు ఎన్నికల సంఘంలోని సీనియర్ అధికారులెవరూ ఈ నెల 9వ తేదీ వరకు సెలవు తీసుకోవద్దని సూచించింది. కానీ ఎస్ఈసీ జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్ 30 రోజులపాటు సెలవుపై వెళ్లారు. ఇతర ఉద్యోగులు సైతం సెలవుపై వెళ్లేలా ఆయన ప్రభావితం చేశారనే అభియోగాలతో ఎస్ఈసీ ఆయన్ను విధుల నుంచి తొలగించింది.
-
డివిజన్ బెంచ్కి ఎన్నికల సంఘం
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం వెలువరించిన షెడ్యూల్ను న్యాయస్థానం సస్పెండ్ చేసింది. ఎలక్షన్ల కంటే ప్రజారోగ్యానికే పెద్దపీట వేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఎన్నికల ప్రక్రియ అడ్డు కావొద్దని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును ఎస్ఈసీ ఓ రకంగా షాక్గానే చెప్పుకోవచ్చు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. ఎన్నికల సంఘం డివిజన్ బెంచ్కు వెళ్లనుంది.
-
ఆ జంటకు ముందుంది ముసళ్ళ పండుగః వర్ల రామయ్య
పంచాయతీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు స్టే ఇవ్వడంపై వర్ల రామయ్య.. విజయసాయిరెడ్డిని టార్గెట్ చేశారు. పంచాయితీ ఎన్నికల నిర్వహణపై హైకోర్ట్ స్టే ఇస్తే, విజయసాయిరెడ్డి అట్టహాసం, ఆనాటి "మాయసభ"లో జూదవిజయం తర్వాత శకుని వికటాట్టహాసంలా ఉంది అన్నారు. విర్రవీగకు నేస్తమా! ముందుంది జంటకు ముసళ్ళ పండుగ.. క్రమం తప్పకుండా కోర్టుకు హాజరవ్వండి చాలు. కాగల కార్యం గంధర్వులు తీరుస్తారు. మిడిసి పడడం మంచిది కాదు అంటూ వర్ల ట్వీట్ చేశారు.
పంచాయితీ ఎన్నికల నిర్వహణపై హైకోర్ట్ స్టే ఇస్తే, A2 విజయసాయిరెడ్డి అట్టహాసం, ఆనాటి "మయసభ"లో జూదవిజయం తర్వాత శకుని వికటాట్టహాసంలా ఉంది. విర్రవీగకు నేస్తమా! ముందుంది జంటకు ముసళ్ళ పండుగ. క్రమం తప్పకుండా కోర్టుకు హాజరవ్వండి చాలు.కాగల కార్యం గంధర్వులు తీరుస్తారు.మిడిసి పడడం మంచిది కాదు
— Varla Ramaiah (@VarlaRamaiah) January 11, 2021
-
పంచాయితీ పోరులో ఇరువురి పంతం..!
ఏపీలో ఎన్నికల సంఘం, రాష్ట్ర సర్కార్ పంచాయితీ పోరులో పంతానికి పోతున్నాయి. స్థానక ఎన్నికలు నిర్వహిస్తే గాని.. దిగిపోను అన్నట్లు నిమ్మగడ్డ పంతం పట్టినట్లు ఉంది. ఇటు సర్కార్ కూడా ఎంతే ధీటుగా రమేష్ కుమార్ను తప్పించాకే ఎన్నికలు జరపుతామంటూ భీష్మించుకున్నట్లు కనిపిస్తోంది. అటు ఎన్నికల సంఘం. లోకల్ వార్లో ఎత్తులు.. పై ఎత్తులు కొనసాగుతున్నాయి. ఎవరి పంతం వారిదే అన్నట్లు ముందుకు సాగతున్నాయి. తమ వాదనకు బలం చేకూర్చేలా కామెంట్స్ చేస్తూ వ్యూహాలు రచిస్తున్నాయి.
-
కోర్టు జోక్యం ఉండకూడదంటున్న ఎన్నికల సంఘం
ఇప్పటికే హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన ఎన్నికల సంఘం.. డివిజన్ బెంచ్ ముందు తమ వాదన వినిపించబోతుంది. సుప్రీం కోర్టు గైడ్లైన్స్ను ఈ సందర్భంగా కోడ్ చేయబోతుంది. ఒకసారి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక.. కోర్టు జోక్యం ఉండకూడదన్నది ఎన్నికల సంఘం వాదన. దీనిపైనే గవర్నర్కు ఫిర్యాదు చేయబోతున్నారు నిమ్మగడ్డ. గతంలో జరిగిన పరిణామాలు.. ఎన్నికల సంఘానికి ఉన్న హక్కుల గురించి.. గవర్నర్కు వివరించబోతున్నట్లు తెలుస్తోంది.
-
హైకోర్టు ఆదేశాలను స్వాగతించిన రాష్ట్ర ప్రభుత్వం
ఏపీలో పంచాయితీ ఎన్నికల నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రభుత్వ అభిప్రాయాలను రాష్ట్ర ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21లను ఉల్లంఘించేలా ఎస్ఈసీ నిర్ణయం ఉందని వ్యాఖ్యానించింది ధర్మాసనం. మరోవైపు హైకోర్టు ఆదేశాలను స్వాగతించింది ప్రభుత్వం.
-
గవర్నర్ను కలుసుకోనున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ
ఏపీలో పోలింగ్, ఫలితాలకు ముందే ఎన్నికల షెడ్యూల్ రౌండ్లు తిరుగుతోంది. ఎన్నికలు ఆగాలా.. సాగాలా అనే పోటీలో తొలిరౌండ్ ప్రభుత్వమే విజేతగా నిలిచింది. సోమవారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో ఎన్నికలు మార్చి తర్వాతే అన్న క్లారిటీ వచ్చేసింది. కానీ సెకండ్ ఆప్షన్కు వెళ్లి.. ప్లాన్ బీ అమలు చేస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. హైకోర్టులో మరో పిటిషన్ వేసేందుకు రెడీ అవుతోంది. డివిజన్ బెంచ్లో పిటిషన్తో పాటు, గవర్నర్ దగ్గరకూ వెళ్లీ సీన్ను మళ్లీ మొదటికి తెచ్చారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.
Published On - Jan 12,2021 1:05 PM