CM Jagan: గోదావరిలో మరింత వరద పోటు.. అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు..
కోస్తా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం జగన్. సహాయక చర్యలు, ముందస్తు జాగ్రత్తలపై సమీక్ష చేశారు. అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం జగన్.
భారీ వర్షాలు, గోదావరి వరదల నేపథ్యంలో ముందు జాగ్రత్తలు చేపట్టింది ఏపీ సర్కార్. కోస్తా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం జగన్. సహాయక చర్యలు, ముందస్తు జాగ్రత్తలపై సమీక్ష చేశారు. అధికారులకు పలు సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను మరింత అప్రమత్తం చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్. రేపటికల్లా వర్షాలు తగ్గుముఖం పడతాయని ఐఎండీ నివేదిక చెప్తుందన్నారు. గడిచిన 100 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా గోదావరికి జూలై మొదటివారంలో వరదలు వచ్చాయి. రేపటికల్లా 15 నుంచి 16 లక్షల క్యూసెక్కుల వరద ధవళేశ్వరం చేరుకునే అవకాశం ఉంది.
గోదావరికి ముందస్తుగానే వరదలు వచ్చాయన్నారు. జులై మాసంలోనే 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చిందని, ఇప్పడు రెండో ప్రమాద హెచ్చరిక నడుస్తోందన్నారు. బుధవారం ఉదయానికి వరద పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని హెచ్చరించారు. 16 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందన్నారు సీఎం జగన్. దీనివల్ల తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. మహారాష్ట్రలో భారీ వర్షాల నేపథ్యంలో గోదారినదికి వరదలు కొనసాగే అవకాశం ఉందని.. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం జరగకూడదని ఆదేశించారు.
మహారాష్ట్రలో భారీ వర్షాల వల్ల మరో నాలుగైదు రోజులు గోదావరి తీర ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒక్క మరణం కూడా సంభవించకుండా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు సిద్దంగా ఉన్నాయి. 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూంలు ఏర్పాటుచేసి చర్యలు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలి.
పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయిలు ఇవ్వాలని… ఒక్కో కుటుంబానికి రెండువేల ఆర్థికసాయం అందించాలి సూచించారు. ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేయాలి. ప్రమాదకర చెరువులు, ట్యాంక్ లు, కట్టడాలను గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి.