అంబేడ్కర్ విగ్రహం.. పార్క్ తలమానికంగా ఉండాలి : సీఎం జగన్
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం - పార్క్ నిర్మాణాన్ని ఏపీ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విజయవాడ స్వరాజ్ మైదాన్లో ఈ అద్భుత సుందరవనాన్ని రూపొందించ తలపెట్టారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం..
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం – పార్క్ నిర్మాణాన్ని ఏపీ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విజయవాడ స్వరాజ్ మైదాన్లో ఈ అద్భుత సుందరవనాన్ని రూపొందించ తలపెట్టారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం.. పెద్ద పార్కు అభివృద్ది మాస్టర్ ప్లాన్పై సీఎం జగన్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. నవంబరు 1న పనులు ప్రారంభించి 13 నెలల్లోగా పూర్తయ్యేలా చూడాలని కచ్చితమైన ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా వివిధ సంస్థల ప్రతినిధులు సీఎంకు పలు నమూనాలు ప్రదర్శించారు. విగ్రహంతో పాటు, పార్కు నిర్మాణానికి సంబంధించిన విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. స్పందించిన జగన్.. అంబేద్కర్ విగ్రహం విజిబిలిటీ ముఖ్యమని, ఎక్కడి నుంచి చూసినా విగ్రహం స్పష్టంగా కనిపించాలని సూచించారు. అదే విధంగా అక్కడ నిర్మించే పార్కు సైతం పూర్తి ఆహ్లాదకర వాతావరణం కలిగి ఉండాలని స్పష్టం చేశారు. సదరు స్ధలంలో ఉన్న ఇరిగేషన్ ఆఫీస్లు, మిగిలిన ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ వెంటనే తరలించాలని అధికారులను ఆదేశించారు. అంతేగాకుండా ఎంజీ రోడ్ నుంచి పార్క్ కనెక్టివిటీ కూడా అందంగా తీర్చిదిద్దాలని.. మొత్తం మీద అక్కడంతా ఆహ్లాదకర వాతావరణమే కనిపించేలా ప్రణాళిక రచించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా పార్కులో ఒక కన్వెన్షన్ హాల్ కూడా ఏర్పాటు చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్న ముఖ్యమంత్రి.. కన్వెన్షన్ సెంటర్, ఫుడ్ కోర్టు మాత్రమే కమర్షియల్గా ఉండాలని, వీటిపై వచ్చే ఆదాయం పార్క్ నిర్వహణకు ఉపయోగపడుతుందని సూచించారు. వీలైనంత వరకు కాంక్రీట్ నిర్మాణాలు తగ్గించాలని, మంచి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని జగన్ సూచనలు చేశారు.