AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: అమరావతిలో వరల్డ్ బ్యాంక్ టీం.. ఆ అంశంపైనే సీఎం చంద్రబాబుతో కీలక భేటి

ఏపీ సీఎం చంద్రబాబుతో వరల్డ్‌ బ్యాంక్‌ ప్రతినిధుల బృందం భేటీ అయింది. రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చించారు. మూడు రోజుల టూర్‌లో భాగంగా అమరావతిలో పర్యటిస్తోన్న వరల్డ్‌ బ్యాంక్‌ టీమ్‌.. తొలి రెండు రోజుల్లో అమరావతి నిర్మాణాలు, రహదారులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసింది.

AP News: అమరావతిలో వరల్డ్ బ్యాంక్ టీం.. ఆ అంశంపైనే సీఎం చంద్రబాబుతో కీలక భేటి
Cm Chandrababu
Ravi Kiran
|

Updated on: Aug 13, 2024 | 8:23 AM

Share

రాజధాని అమరావతి అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. అమరావతిపై కూటమి ప్రభుత్వం స్పెషల్‌ ఫోకస్‌ పెట్టడంతో పెండింగ్‌ పనులన్నీ వడివడిగా సాగుతున్నాయి. అటు.. పెట్టుబడుల కోసం ఔత్సాహికులను ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. ప్రధానంగా.. గతంలో చంద్రబాబుతో టచ్‌లో ఉన్న ప్రతినిధులు అమరావతికి తరలివచ్చి ఆయనతో చర్చలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే.. తాజాగా.. అమరావతిలో సీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం సమావేశం అయింది. ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతి నిర్మాణంలో ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందనే దానిపై వరల్డ్‌ బ్యాంక్‌ ప్రతినిధులకు చంద్రబాబు వివరించారు.

ప్రపంచంలోనే ఉత్తమ ప్రమాణాలు, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని అమరావతి నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఇక.. నలుగురు సభ్యులతో కూడిన ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధుల బృందం రెండు రోజులు అమరావతిలో పర్యటించింది. దానిలో భాగంగా.. సీఎం చంద్రబాబును కలిసిన బృందంలో వరల్డ్ బ్యాంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సీనియర్ స్పెషలిస్ట్ రఘు కేశవన్, లీడ్ ట్రాన్స్‌పోర్ట్ స్పెషలిస్ట్ గెరాల్డ్ పాల్ అలీవియర్, సీనియర్ అర్బన్ స్పెషలిస్ట్ కింగ్ యున్, సౌత్ ఏషియా అర్బన్ ప్రాక్టీస్ మేనేజర్ అబేదాలిరజాక్ ఉన్నారు. అయితే.. మూడు రోజుల పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన వరల్డ్‌ బ్యాంక్‌ బృందం.. సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమావేశం అయింది.

సీఆర్టీయే గురించి.. అమరావతి ప్రాజెక్ట్‌ ప్రస్తుత పరిస్థితి గురించి అధికారులు ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందానికి వివరించారు. ఆ తర్వాత.. అమరావతిలో క్షేత్రస్థాయిలో పర్యటించి నిర్మాణంలోనున్న భవనాలను పరిశీలించారు. అంతకుముందు.. ఆదివారం రోజున రాజధానిలోని రోడ్లను, కొండవీటి వాగు ఎత్తిపోతల పంప్‌హౌస్‌ను సందర్శించడంతోపాటు.. విట్‌, ఎస్‌ఆర్‌ఎం, ఎయిమ్స్‌ను పరిశీలించారు వరల్డ్‌ బ్యాంక్‌ ప్రతినిధులు. మొత్తంగా.. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధే లక్ష్యంగా కూటమి సర్కార్‌ జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..