Andhra Pradesh: రాజధాని భూముల విక్రయానికి సర్వం సిద్ధం.. నిధుల సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయం
రాజధాని అభివృద్ధి కోసం నిధులు సేకరించేందుకు అమరావతిలో(Amaravathi) భూములు అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు(High Court) ఆదేశాలతో అమరావతి అభివృద్ధి కోసం నవులూరు, పిచ్చుకలపాలెంలో 14 ఎకరాల భూమి అమ్మకానికి...
రాజధాని అభివృద్ధి కోసం నిధులు సేకరించేందుకు అమరావతిలో(Amaravathi) భూములు అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు(High Court) ఆదేశాలతో అమరావతి అభివృద్ధి కోసం నవులూరు, పిచ్చుకలపాలెంలో 14 ఎకరాల భూమి అమ్మకానికి ఈ నెల 6న జీవో జారీ చేసింది. తాజాగా 248.34 ఎకరాలు అమ్మడానికి సీఆర్డీఏ సిద్ధమైంది. ఎకరాకు రూ.10 కోట్ల చొప్పున 2,480 కోట్ల రూపాయలు సేకరించాలని నిర్ణయించారు. రాజధాని మీదుగా ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న కాజ-గుండుగొలను బైపాస్ రహదారి పక్కనే 10 ఎకరాలు, సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన 4 ఎకరాలు విక్రయించేందుకు అనుమతిస్తూ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అమరావతిలో ప్రధాన మౌలిక వసతుల నిర్మాణం, భూములిచ్చిన రైతులకు స్థలాలు అభివృద్ధి చేసి ఇచ్చేందుకు రూ.3,500 కోట్ల రుణం కోసం సీఆర్డీఏ ప్రయత్నిస్తోంది.
అయితే.. భూములు అమ్మగా వచ్చిన డబ్బును రాజధాని కోసమే ఖర్చు పెట్టాలి. ఇతర అవసరాలకు ఈ మొత్తాన్ని ఉపయోగించవద్దని హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. రాజధాని మాస్టర్ప్లాన్ని కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. మంగళగిరికి సమీపంలో, జాతీయ రహదారికి దగ్గరలో 20 ఏళ్ల క్రితమే అభివృద్ధి చేసిన లేఅవుట్లో స్థలాలు అమ్మేందుకు సీఆర్డీఏ ప్రయత్నిస్తేనే సరైన స్పందన రావడం లేదు. అలాంటిది రాజధానిలో ఎకరం రూ.10 కోట్లకు అమ్ముతామంటే కొనేందుకు ఎవరు ముందుకు వస్తారనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది.