ఏపీలో ప్రశాంతంగా ముగిసిన నాలుగో విడత పంచాయతీ పోలింగ్.. మొదలైన కౌంటింగ్
AP Sarpanch elections 2021 : ఆంధ్రప్రదేశ్ నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. మరోవైపు చివరి విడత ఓట్ల లెక్కింపులు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. మరోవైపు చివరి విడత ఓట్ల లెక్కింపులు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరికాసేపట్లో సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించేందుకు ఎన్నికల అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ముందుగా వార్డు సభ్యులకు సంబంధించి ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను కౌంట్ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 18,967 మంది సుపర్వైజర్లను ఏర్పాటు చేశారు. అలాగే కౌంటింగ్ కోసం 51,862 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. గత అనుభవాల దృష్ట్యా కౌంటింగ్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల కమిషన్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది.
మధ్యాహ్నం 2:30 గంటల సమయానికి 78.90 శాతం ఓటింగ్ జరిగినట్లు సమాచారం. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 85.60 శాతంగా ఉండగా… అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో 73.20 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళంలో 78.81, విజయనగరంలో 85.60, విశాఖ 84.07, తూర్పు గోదావరి జిల్లా 74.99 పశ్చిమ గోదావరి జిల్లా 79.03, కృష్ణా 79.29, గుంటూరు 76.74, ప్రకాశంలో జిల్లాలో 78.77 శాతం నమోదైంది. నెల్లూరులో 73.20 శాతం పోలింగ్ నమోదు కాగా… చిత్తూరులో 75.68, కడప 80.68, కర్నూలులో 76.52, అనంతపురంలో 82.26 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. నెల్లూరులో వర్షాలు కురవడంతో ఓటింగ్ తగ్గినట్లు తెలియవచ్చింది. కౌంటంగ్ సమయంలో వెబ్ క్యాస్టింగ్, జనరేటర్లు ఏర్పాటు చేశారు. కొన్ని జిల్లాల్లో చెదురు ముదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.