Andhra Pradesh High Court: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నేడు హైకోర్టులో విచారణ.. తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ..
Andhra Pradesh High Court: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంశంపై ఇవాళ రాష్ట్ర హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది.
Andhra Pradesh High Court: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంశంపై ఇవాళ రాష్ట్ర హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ తరఫున సీనియర్ న్యాయవాదులు ఆదినారాయణ, సీతారం మూర్తి వాదనలు వినిపించనున్నారు. ఏపిలో ఎన్నికలు జరపాల్సిందే అని ఎస్ఈసీ పట్టుదలతో ఉంది. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చి చెబుతోంది. ఇరుపక్షాల వాదనలు పూర్తయిన అనంతరం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ధర్మాసనం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఏ తీర్పు వెల్లడిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కాగా, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు సింగిల్ బెంచ్ను ఆశ్రయించగా.. సింగిల్ బెంచ్ ధర్మాసనం ఆ నోటిఫికేషన్ను సస్పెండ్ చేసింది. అయితే, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎస్ఈసీ హైకోర్టు డివిజన్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికలు నిర్వహణకు అనుమతించాలని కోరుతూ కోర్టును అభ్యర్థించింది. ఈ నేపథ్యంలోనే సంబంధిత పిటిషన్నపై సోమవారం నాడు హైకోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి.
2018లోనే స్థానిక సంస్థల ఎన్నికల సమయం ముగిసినా.. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సహకరించలేదని ఎస్ఈసీ ధర్మాసనానికి తెలిపింది. పబ్లిక్ ఒత్తిడితో ఎన్నికల నిర్వహణకు గతేడాది ముందుకు వెళ్లామని, అయితే, కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయని హైకోర్టుకు ఎస్ఈసీ తరఫు న్యాయవాది వివవరించారు. తిరిగి హైకోర్టు ఆదేశాలతోనే ఎన్నికల నిర్వహణకు ముందుకు వెళ్లామన్నారు. అయితే, ఎన్నికలకు వెళ్తామంటే మొదట కరోనా అన్నారు, ఇప్పుడు వ్యాక్సిన్ అంటున్నారని ఎస్ఈసీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
దేశంలో నాలుగు హైకోర్టుల్లో ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయాలకే సానుకూలంగా తీర్పులు వచ్చాయని ఎస్ఈసీ ఈసందర్భంగా హైకోర్టుకు గుర్తు చేసింది. గతంలో సుప్రీంకోర్టులో కూడా ఇదే అంశాలను ప్రస్తావించినట్టు వెల్లడించింది. ఎన్నికల కమీషన్ తీసుకున్న నిర్ణయాలలో న్యాయస్థానాలు కల్పించుకోవడానికి వీల్లేదన్న ఎస్ఈసీ తరఫు న్యాయవాది, సింగిల్ బెంచ్ జడ్జి కన్ఫ్యూజ్ అయ్యే అలాంటి తీర్పు ఇచ్చి ఉంటారని డివిజన్ బెంచ్ కు విన్నవించారు. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉందని, అప్పటివరకూ ఎన్నికలు రద్దు చేయాలని ప్రభుత్వం తరఫున హైకోర్టును ఏజీ కోరారు. ఇరు పక్షాల వాదనల నేపథ్యంలో విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది హైకోర్టు. మరి ఇవాళ హైకోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో వేచి చూడాల్సిందే.
Also read:
Varun Tej: వరుణ్ తేజ్ కొత్త సినిమా పోస్టర్ రిలీజ్.. బాక్సింగ్ పంచ్తో అదరగొడుతున్న మెగా హీరో..
కోవిడ్ భయంతో విమానాశ్రయంలో మూడు నెలలు గడిపిన ఇండియన్-అమెరికన్, అరెస్టు చేసిన యూఎస్ పోలీసులు