మార్కెటింగ్ వ్యవస్థ బలోపేతానికి జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. కొత్తగా మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ సర్కార్ సంక్షేమ పథకాలతో దూసుకెళ్తోంది. నవరత్నాలతో పాటూ ఎన్నో పథకాలను అమలు చేస్తోంది.
AP multipurpose facility centers : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ సర్కార్ సంక్షేమ పథకాలతో దూసుకెళ్తోంది. నవరత్నాలతో పాటూ ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 2021–22కు కూడా నవరత్నాల్లోని సంక్షేమ పథకాల ఫలాలను లబ్ధిదారులకు ఏ నెలల్లో అందించేది ముందుగానే తెలియచేస్తూ సంక్షేమ క్యాలెండర్ను ప్రకటించారు. ముఖ్యంగా అన్నదాతలను ఆదుకునేందుకు మరో ముందడుగు వేసింది ఏపీ సర్కార్. ప్రపంచానికి మరో రైతు కష్టం తెలిసేలా ఇ–మార్కెటింగ్ ప్లాట్ఫామ్ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
ఆరుగాలం కష్టించి పండించిన పంటను నచ్చిన ధరకు అమ్ముకునేందుకు అన్నదాతలు పడుతున్న కష్టాలకు త్వరలో తెరపడనుంది. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రాంతానికి చెందిన వ్యాపారులైనా రైతు నుంచి నేరుగా ఉత్పత్తులను కొనుగోలు చేసేలా మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటు ఫ్లాన్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా వీటిని తీర్చిదిద్దేందుకు సీఎం వైఎస్ జగన్ సర్కార్ నిర్ణయించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేయడంతో మార్కెటింగ్ శాఖ ఏర్పాట్లను వేగవంతం చేసింది.
గ్రామీణ ప్రాంతాల్లో పండించిన పంటను స్థానికంగా విక్రయించేలా రైతు భరోసా కేంద్రాల సమీపంలో మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. దాదాపు రూ.2,718.11 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటయ్యే ఈ కేంద్రాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.264.2 కోట్లు ఖర్చు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం కేంద్రం రూ.74 కోట్లు సబ్సిడీగా అందించనుంది. రూ.2,361.1కోట్లను అగ్రి ఇన్ఫర్ ఫండ్ (ఏ.ఐ.ఎఫ్) కింద వడ్డీ ఉపసంహరణ స్కీమ్ ద్వారా ఒక శాతం వడ్డీకి నాబార్డు రుణం రూపంలో అందించనుంది. రైతు కమిటీల ద్వారా కొనుగోలు చేసే కొన్ని రకాల పరికరాలకు సంబంధించి రూ.18.9 కోట్లు లబ్ధిదారుల వాటా కింద భరించాల్సి ఉంటుంది. కాగా, ఈ సెంటర్ల కోసం రైతు భరోసా కేంద్రాల సమీపంలో 50 సెంట్ల నుంచి ఎకరం స్థలాన్ని అధికారులు సమీకరిస్తున్నారు. గ్రామస్థాయిలో మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో పంటకోతకు ముందు, తర్వాత రైతులకు మౌలిక సదుపాయాలను ప్రత్యేక వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నారు.
ముఖ్యంగా దళారీల బెడద లేకుండా పంట ఉత్పత్తులను రైతులు నేరుగా కళ్లాల నుంచి విక్రయించుకునే అవకాశం ఇ–మార్కెటింగ్ ఫ్లాట్ఫామ్ ద్వారా కల్పించనున్నారు. దీనిద్వారా ప్రతి రైతును అఖిల భారత మార్కెట్కు అనుసంధానిస్తారు. గిట్టుబాటు ధర లభించే వరకు ఈ సెంటర్లలో నిల్వ చేసుకుని తమకు నచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. ఏ గ్రామంలో ఏ ఉత్పత్తులు పండిస్తున్నారు? సాగులో ఎలాంటి యాజమాన్య పద్ధతులను పాటిస్తున్నారు? నాణ్యత ఎలా ఉంది? దిగుబడి ఎంత? తదితర అంశాలను ఈ ప్లాట్పామ్ ద్వారా వ్యాపారులు సైతం తెలుసుకోవచ్చు.
ఆర్బీకేలకు అనుసంధానంగా మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రాగానే వచ్చే నెలలో రివర్స్ టెండరింగ్ ద్వారా టెండర్లను పిలవబోతున్నామని మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న తెలిపారు. ముందుగా జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపి ఆ తర్వాత టెండర్లను పిలుస్తామన్నారు. మార్చిలో ఈ ప్రక్రియ పూర్తి చేసి ఏప్రిల్లో పనులకు శ్రీకారం చుట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని ఆమె వెల్లడించారు. వీటిని దశలవారీగా 2022 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు.
మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ల ప్రత్యేకతలుః
❂ ప్రధానంగా రూ.1,637.05 కోట్లతో 4,277 డ్రై స్టోరేజ్, డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్
❂ రూ.331.80 కోట్లతో ప్రజాపంపిణీ వ్యవస్థ కోసం 60 అధిక నిల్వ సామర్థ్యం కలిగిన గిడ్డంగులు
❂ రూ.188.73 కోట్లతో 1,483 కలెక్షన్ సెంటర్లు (ధాన్యం సేకరణ కేంద్రాలు), కోల్డ్ రూమ్స్ (శీతల గిడ్డంగులు), టర్మరిక్ బాయిలర్స్/పాలిషర్స్,
❂ రూ.378.24కోట్లతో 7,950 ప్రైమరీ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ (ధాన్యం శుద్ధి పరికరాలు)
❂ రూ.60.86 కోట్లతో 10,687 ఎస్సాయింగ్ ఎక్విప్మెంట్ (ధాన్యం నాణ్యత పరీక్షించే సామగ్రి)
❂ రూ.108.92 కోట్లతో 10,678 ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఎక్విప్మెంట్ (ధాన్యం కొనుగోలు సామగ్రి)
❂ రూ.12.51 కోట్లతో ‘ఇ–మార్కెటింగ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్’
Read Also… నదుల అనుసంధానంపై టాస్క్ఫోర్స్ బృందం సమావేశం.. తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలపై చర్చ