ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..ఇంగ్లీష్ మీడియంకు గ్రీన్ సిగ్నల్!
ఏపీలో ఇంగ్లీష్ మీడియం ఆప్షన్ ఉండాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి సర్కారు దీనిపై వివరాలు సేకరించింది.
ఏపీలో 2020-21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మే 13న ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలోని అన్ని స్కూళ్లల్లో ఆంగ్ల మాధ్యమం అమలు కానుంది. మైనార్టీ భాషా మాధ్యమం స్కూళ్లు యధాతథంగా కొనసాగనున్నాయి.
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనపై ఎస్సీఈఆర్టీ(విద్యాపరిశోధన శిక్షణ మండలి) నివేదిక ఇచ్చింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 6 వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ఎస్సీఈఆర్టీ సూచించింది. అయితే, మైనారిటీ పాఠశాలలు యధావిధిగా కొనసాగుతాయి. ఒకవేళ అక్కడ ఎవరన్నా ఇంగ్లీష్ మీడియం కోరితే…. ప్రత్యేక సెక్షన్ ఏర్పాటు చేయాలని ఎస్సీఈఆర్టీ సూచించింది. ఏపీలో ఇంగ్లీష్ మీడియం ఆప్షన్ ఉండాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి సర్కారు దీనిపై వివరాలు సేకరించింది. 17,97,168 మంది విద్యార్థుల్లో కేవలం 53,947 మంది మాత్రమే తెలుగు మీడియం వైపు మొగ్గు చూపారు. అయితే, కోరిన ప్రతి చోటా తెలుగు మీడియం ఏర్పాటు సాధ్యం కాదని, మండలానికి ఒక స్కూల్ చొప్పున 672 తెలుగు మీడియం స్కూల్స్ ఏర్పాటు చేయవచ్చని నివేదికలో పేర్కొంది.