Sucharitha : వైయస్ జగన్ అద్భుత పాలనలో భాగస్వామ్యమైనందుకు నా జన్మ ధన్యమైంది : హోం మంత్రి మేకతోటి సుచరిత
విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెస్తూ.. పాలనలో నూతన ఒరవడి సృష్టించిన ఘనత జగన్ దేనని..
AP Home minister Mekatoti Sucharitha : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన రెండేళ్ళలోనే వైయస్ జగన్ ప్రతి వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొస్తున్నారని ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెస్తూ.. పాలనలో నూతన ఒరవడి సృష్టించిన ఘనత జగన్ దేనని ఆమె చెప్పారు. జగన్ మోహన్ రెడ్డితోనే అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం సాధ్యమైందని ఆమె పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి నేటికి రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా హోం మంత్రి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. సమాజంలో అణగారిన వర్గాలకు ఎప్పుడూ అందనటువంటి నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో ఈరోజు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వాటా ఇచ్చారని సుచరిత చెప్పుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు రిజర్వేషన్లు కల్పించారని.. ఎప్పుడూ అందని మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ పదవులు, ఆలయ కమిటీల్లోగానీ, ట్రస్టు బోర్డుల్లోగానీ అవకాశాలు కల్పించిన ఘనత ఒక్క జగన్ మోహన్ రెడ్డిగారికే దక్కుతుందని హోం మంత్రి తెలిపారు. గతంలో ఎప్పుడూ రాజకీయపరంగా ఈ వర్గాలకు ఇటువంటి అవకాశాలు కల్పించిన పరిస్థితి లేదు.. ఇప్పుడు సామాజిక న్యాయం ప్రకారం, రాజకీయ పదవుల్లో సమాన అవకాశాలు పొందుతున్నామంటే.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆలోచనా విధానాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారి వల్లే సాధ్యమైంది అని సుచరిత స్పష్టం చేశారు.