ఏపీలో 6 కరోనా మరణాలు..363కు చేరిన పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 363కు చేరుకుంది. కాగా, వైరస్ బారిన పడ్డ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు...
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గురువారం మరో 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 363కు చేరుకుంది. కాగా, వైరస్ బారిన పడ్డ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కోవిడ్ మృతుల సంఖ్య 6కు చేరింది.
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తోంది. బాధితుల సంఖ్య 363కు చేరింది. గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొత్తగా 15 కరోనా కేసులు నమోదయ్యాయని ఏపీ సర్కారు ప్రకటించింది. కాగా, వైరస్ నుంచి కోలుకుని నెగేటివ్ వచ్చిన చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని డిశ్చార్జ్ చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకొని 10 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక, వైరస్ కారణంగా వేర్వేరు జిల్లాల్లో ఇద్దరు మరణించారు. అనంతపురం జిల్లాలో ఒకరు చనిపోగా.. గుంటూరులో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య ఆరుకు చేరింది.
జిల్లాల వారీగా చూస్తే.. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 75 కరోనా కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానంలో గుంటూరు జిల్లా ఉంది. ఇక్కడ 51 మంది కరోనా పాజిటివ్ అని తేలింది. అనంతపురం 13, చిత్తూరు 20, తూర్పు గోదావరి 13, కడప 29, కృష్ణా 35, నెల్లూరు 48, ప్రకాశం 28, విశాఖపట్నం 20, పశ్చిమ గోదావరి 22, తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రమే కరోనా కేసులు నమోదు కాలేదు.