వరుస ఘటనలపై ఏపీ పోలీసులు అప్రమత్తం.. అన్ని ఆలయాల వద్ద భద్రత కట్టుదిట్టం.. సీసీ కెమెరాలతో నిఘా నేత్రం
త్యధికమైన ఆలయాలు కలిగి ఉన్న చిత్తూరు జిల్లాలో మరో ఘటన జరగకుండా ముందస్తుగా జాగ్రత్త చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు.. అత్యధికమైన ఆలయాలు కలిగి ఉన్న చిత్తూరు జిల్లాలో మరో ఘటన జరగకుండా ముందస్తుగా జాగ్రత్త చర్యలు చేపట్టారు. అన్ని ఆలయాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
పవిత్ర పుణ్యక్షేత్రాలకు నిలయం చిత్తూరు జిల్లా .తిరుమల , శ్రీకాళహస్తీశ్వర, కాణిపాకం, గోవింద రాజస్వామి దేవాలయం, వరదరాజ స్వామి, కపిల తీర్థం, శ్రీనివాస మంగపురం, తొండమాన్, తిరుచానూరు పద్మావతి లాంటి ఎన్నెన్నో ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. రాష్ట్రంలో వరుసగా ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా లో అలాంటి ఘటనకు అవకాశం లేకుండా ముందస్తుగా అప్రమత్తమయ్యారు పోలీసులు. ప్రతి ఆలయం పరిసరాలను సీసీ కెమెరాల నిఘాలో తీసుకువస్తున్నారు.
అంతేకాకుండా మారుమూల ప్రాంతాల్లో ఉన్న అలయాలపైనా పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆలయాల నిర్వాహకులు, ఉద్యోగులతో పోలీసులు సమావేశమవుతున్నారు. ఈ సందర్బంగా ఆలయాలపై దాడులు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా పోలీస్ ఉన్నతాధికారులు సూచనలు ఇస్తున్నారు. రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులపై జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, టెంపుల్స్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నామని చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా టీటీడీ అనుబంధ ఆలయాలతోపాటు దేవాదాయ శాఖ ఆలయాలు, ప్రైవేట్ ఆలయాలు 4 వేలకు పైగానే ఉన్నాయి. దాదాపు 4 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసామని, అయా గ్రామాల్లో డిఫెన్స్ కమిటీ లను ఏర్పాటు చేసి ఆలయాల భద్రతపై నిఘా పెంచామన్నారు. సురక్ష ఆపరేషన్ కొనసాగుతోందన్న ఎస్పీ.. మత సామరస్యాన్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నించే అసాంఘిక శక్తులపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామన్నారు. అవసరమైతే పిడీ యాక్ట్ కింద కేసులు పెడతామని హెచ్చరించారు.
ఎస్పీ ఆదేశాలతో ఇటు డీఎస్పీ స్థాయి అధికారులు.. అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బందితో సమావేశమయ్యారు..అలాగే ఆలయాల కమిటీలు, భక్తులతోనూ సమావేశమై సలహాలు తీసుకున్నారు..అలాగే అనుమానిత వ్యక్తులు గ్రామంలోకి ఆలయ పరిసరాల్లోకి వస్తే.. వెంటనే సంచారం ఇవ్వాలని గ్రామస్తులను కోరుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చిత్తూరు జిల్లాలో ఒక్క ఆలయంలో కూడా ఇలాంటి ఘటన జరగకుండా చూస్తామని పోలీసులు భరోసా ఇస్తున్నారు.