నిరుద్యోగులకు శుభవార్త.. వైద్యారోగ్య శాఖలో ఖాళీలు భర్తీకి అనుమతి..
ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వైద్యారోగ్య శాఖలో 9,712 పోస్టులు భర్తీ చేసేందుకు అనుమతులు ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో మునుపెన్నడూ లేనంతగా కొలువుల జాతర ఉండబోతోంది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగానే వైద్యారోగ్య శాఖలో 9,712 పోస్టులు భర్తీ చేసేందుకు అనుమతులు ఇచ్చింది.
దీనికి సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జవహర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వాటిలో 2,153 రెగ్యులర్ పోస్టులు, 5,574 కాంట్రాక్టు పోస్టులు, 1,985 ఔట్ సోర్సింగ్ పోస్టులు ఉన్నాయి. అలాగే డీపీహెచ్ పరిధిలో 3167 పోస్టులను, మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 4131, ఏపీవీవీపీ పరిధిలో 2414 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వైద్యులు, ల్యాబ్ టెక్నిషియన్లు, ఇతర ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
గ్రామ/ వార్డు సచివాలయాల్లో పోస్టులు భర్తీ…
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో మిగిలిన 17,097 పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు రంగం సిద్దం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దీనితో జూలైలో ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణకు తాము సిద్దంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పధకాల క్యాలెండర్ను అన్ని గ్రామ సచివాలయాల్లో ఉంచాలని, లబ్దిదారుల జాబితా, ముఖ్యమైన నెంబర్లను సచివాలయాల్లో ప్రదర్శించాలని జగన్ చెప్పారు. కాగా, మార్చి నాటికి గ్రామ/ వార్డు సచివాలయాల నిర్మాణం పూర్తి కావాలని స్పష్టం చేశారు.