రైతులను ఇబ్బంది పెట్టొద్దు..: సీఎం జగన్
సాగునీటి ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
AP CM YS Jagan Review : సాగునీటి ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పోలవరం, ఉత్తరాంధ్రతో పాటు వివిధప్రాంతాల్లో కొనసాగుతున్న ప్రాజెక్టుల వివరాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు అధికారులు.
వృధాగా పోతున్న వరద జలాలను ఒడిసి పట్టాలని సూచించిన సీఎం జగన్.. చిత్రావతి, గండికోటలో నీరు నింపాలన్నారు. నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, అవుకు సొరంగం–2, పూల సుబ్బయ్య వెలిగొండ–హెడ్ రెగ్యులేటర్ పనులు, తోటపల్లి, తారకరామతీర్ధసాగర్, వంశధార–నాగావళి లింక్, బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు స్టేజ్–2 రెండో దశ, పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం లేకుండా కొనసాగించాలని సీఎం జగన్ నిర్దేశించారు.
చిత్రావతి బాలెన్సింగ్ రిజర్వాయర్లో 10 టీఎంసీలు, గండికోట రిజర్వాయర్లో కనీసం 23 టీఎంసీల నీరు నిల్వ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆ మేరకు వెంటనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు ఇవ్వాలన్న సీఎం.. ఎకరాకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నందున రైతులను ఒప్పించాలని అన్నారు. రైతులను ఎక్కడా ఇబ్బంది పెట్టొద్దని, మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు.