నాడు ఓడి..నేడు గెలిచి..జగన్ మహాప్రస్థానం
ఏడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి..క్లుప్తంగా జగన్.. కడప జిల్లా పులివెందులలో 1972 డిసెంబరు 21 న పుట్టిన ఈయన రాజకీయ మహాప్రస్థానం.. 2019, మే 23 న ఓ ఘనమైన మలుపు తిరిగింది. ఏపీలో అటు లోక్ సభ, ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైసీపీ ఘన విజయం సాధించి చంద్రబాబు సారథ్యంలోని టీడీపీని మట్టి కరపించింది. దివంగత సిఎం రాజశేఖర రెడ్డి కుమారుడిగా. ఆ తరువాత ప్రతిపక్ష నేతగా ఆయన రాజకీయ జీవితం ఎన్నో […]
ఏడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి..క్లుప్తంగా జగన్.. కడప జిల్లా పులివెందులలో 1972 డిసెంబరు 21 న పుట్టిన ఈయన రాజకీయ మహాప్రస్థానం.. 2019, మే 23 న ఓ ఘనమైన మలుపు తిరిగింది. ఏపీలో అటు లోక్ సభ, ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైసీపీ ఘన విజయం సాధించి చంద్రబాబు సారథ్యంలోని టీడీపీని మట్టి కరపించింది. దివంగత సిఎం రాజశేఖర రెడ్డి కుమారుడిగా. ఆ తరువాత ప్రతిపక్ష నేతగా ఆయన రాజకీయ జీవితం ఎన్నో ఒడి దుడుకులతో సాగింది. 2004 ఎన్నికల్లో కడప జిల్లాలో తన ఎన్నికల ప్రచారంతో ఈయన పొలిటికల్ కెరీర్ ప్రారంభమైంది. అనంతరం 2009 ఎన్నికల్లో కడప నియోజకవర్గ ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పటినుంచే ఆ జిల్లా ప్రజలు జగన్ కు బ్రహ్మరథం పడుతూ వచ్చారు. అక్రమాస్తులకు సంబంధించి దాదాపు 31 కేసులు జగన్ పై ఉన్నాయి. సీబీఐ చార్జి షీట్లు, జైలు జీవితం అనుభవించిన జగన్..తన పొలిటికల్ కెరీర్ ని మాత్రం సదా ప్రజల అండతో కొనసాగిస్తూ వచ్చారు. వారి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారు. తన తండ్రి మరణం అనంతరం ఆరు నెలల్లోనే జగన్ ఉమ్మడి ఏపీలో ఓదార్పు యాత్రను చేపట్టారు. వైఎస్ మృతిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారి కుటుంబాలను ఓదారుస్తూ వారికి మరింత దగ్గరయ్యారు. ఆ యాత్రల ఫలితంగానా అన్నట్టు నాడు కడప ఉప ఎన్నికల్లో జగన్ 5 లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. 2010 డిసెంబరు 7 న కాంగ్రెస్ కు దూరమై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. కడప జిల్లాలో జరిగిన బైపోల్ లో వైసీపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు చేయాలన్న నాటి యూపీఏ నిర్ణయాన్ని నిరసిస్తూ 125 గంటల నిరవధిక దీక్ష సాగించారు జగన్. 2014 ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైసీపీ ఓడిపోయింది. కానీ ప్రజలకు మాత్రం జగన్ గానీ, వైసీపీ గానీ దూరం కాలేదు. ప్రజల మధ్యే ఉంటూ వచ్చింది. 2017 నవంబర్ 6 న మూడు వేల కిలో మీటర్ల ‘ ప్రజా సంకల్ప యాత్ర ‘ ను చేపట్టారాయన. అది ఈ ఏడాది జనవరి 9 న ముగిసింది. ఈ ఎన్నికల్లో ‘ రావాలి జగన్..కావాలి జగన్ ..’ అన్న ప్రచార నినాదం అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది. ఏపీలో టీడీపీ ప్రభంజనాన్ని నీరు గార్చింది. ఎపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండుతో ఢిల్లీ లో జగన్ చేపట్టిన నిరసన ధర్నాలను ప్రజలు మరచిపోలేదు. హోదా ఇచ్చే ఏ పార్టీతో నైనా తాము కలిసివస్తామని జగన్ విస్పష్టంగా ప్రకటించారు. ఇక-పులివెందుల పులిబిడ్డ ఏపీ సారథిగా ఎలా పాలన కొనసాగిస్తాడో చూడాల్సిందే.