Amith Shah fires కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగిన అమిత్షా
కరోనా వైరస్ ప్రబలకుండా కేంద్రం ఒకవైపు పకడ్బందీ చర్యలు తీసుకుంటుంటే కాంగ్రెస్ నేతలు రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు కేంద్ర హోం మంత్రి అమిత్షా.
Amith Shah fires on Congress party leaders: కరోనా వైరస్ ప్రబలకుండా కేంద్రం ఒకవైపు పకడ్బందీ చర్యలు తీసుకుంటుంటే కాంగ్రెస్ నేతలు రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు కేంద్ర హోం మంత్రి అమిత్షా. దేశ ఆర్థిక కునారిల్లిపోయే ప్రమాదం వున్నా అత్యంత సాహసోపేతంగా, ప్రజారోగ్యమే ముఖ్యమంటూ లాక్ డౌన్ విధించి, దానికి అనుగుణంగా చర్యలు తీసుకంటుంటే.. కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన.
రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న అమిత్షా ఆతర్వాత మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతల విమర్శలపై నిప్పులు చెరిగారు. ఆల్ ఆఫ్ సడన్ నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణంలో అన్ని రాష్ట్రాలను కలుపుకుని కేంద్రం ముందుకు వెళుతుందని, కాంగ్రెస్ నేతలు మాత్రం సరైన ప్రణాళిక లేకుండా లాక్ డౌన్ విధించారంటూ విమర్శలు చేస్తున్నారని అమిత్షా ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా వ్యాప్తికి దేశం యావత్తు ఒక్కతాటిపై నిలవాల్సిన తరుణంలో కాంగ్రెస్ నేతలు చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని, ప్రజలను తప్పుదారి మళ్ళిస్తున్నారని హోం మంత్రి అన్నారు. ప్రధాని తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న ప్రయత్నాలపై దేశంలోను, విదేశాలలో ప్రశంసలు కురుస్తుంటే.. కాంగ్రెస్ నేతలకు మాత్రం కనిపించడం లేదని కామెంట్ చేశారు అమిత్షా. లాక్డౌన్ వంటి నిర్ణయాలు ఏ దేశమైనా అకస్మాత్తుగానే తీసుకుంటుందని, వైరస్ వ్యాప్తికి తీరికగా టైం ఇచ్చి ఆ తర్వాత నింపాదిగా తీసుకోరని అమిత్షా వ్యాఖ్యానించారు.
అమెరికా వంటి దేశాలు లాక్డౌన్ ప్రకటించడంలో జాప్యం చేసి తీవ్ర ప్రాణనష్టాన్ని చవి చూస్తున్న విషయాన్ని అమిత్షా కాంగ్రెస్ నేతలకు గుర్తు చేశారు. నిర్ణయం సడన్గా తీసుకున్నా.. దేశంలో వున్న ప్రతీ ఒక్కరినీ ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, కాంగ్రెస్ నేతలు ప్రజలను తప్పుదారి పట్టించడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.