కొత్త జిల్లాకు అల్లూరి పేరు.. ఏపీ మంత్రి ప్రకటన
ఏపీలో కొత్తగా ఏర్పాటు అవ్వబోయే జిల్లాల్లో ఓ జిల్లాకు మన్నెం వీరుడు అల్లూరు సీతారామరాజు పేరును పెడతామని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.
ఏపీలో కొత్తగా ఏర్పాటు అవ్వబోయే జిల్లాల్లో ఓ జిల్లాకు మన్నెం వీరుడు అల్లూరు సీతారామరాజు పేరును పెడతామని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. శనివారం అల్లూరి 123వ జయంతి నేపథ్యంలో విశాఖ బీచ్ రోడ్డు వద్ద గల అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అవంతి. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటు అయ్యే ఓ జిల్లాకు అల్లూరు పేరు పెట్టి, ఆయన పేరును చరిత్రలో నిలుపుతామని అన్నారు. అలాగే అల్లూరి పుట్టిన విశాఖ జిల్లా పద్మనాభం మండలంలోని పాండ్రంకి గ్రామంను బెస్ట్ టూరిజం స్పాట్గా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది అల్లూరి జయంతి నాటికి కేడీ పేటలో అల్లూరి సమాధి, పాండ్రంగిలో మ్యూజియం అభివృద్ధి చేయడానికి రెండు వందల కోట్లు కేటాయించామని మంత్రి పేర్కొన్నారు.
కాగా తాము అధికారంలోకి వస్తే ఓ జిల్లాకు అల్లూరి పేరును పెడతామని పాదయాత్ర సమయంలో జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక త్వరలోనే ఏపీలో 12 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుండగా.. అందులో ఓ జిల్లాకు అల్లూరి పేరును పెట్టి, తన హామీని నిలబెట్టుకోవాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం.