కరోనా వ్యాక్సినేషన్కు చురుకుగా ఏర్పాట్లు.. మొదటి విడతలో ప్రజాప్రతినిధులకు అవకాశమివ్వండి.. ప్రధానికి పాండిచ్చేరి సీఎం లేఖ
ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ అయా రాష్ట్రాలకు చేరిపోయింది. తమకు కూడా ముందు వరుసలో టీకా వేయాలని రాజకీయనేతలు కోరుతున్నారు.
Puducherry CM letter to PM Modi : దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం చురుకుగా ఏర్పాట్లు చేస్తోంది. దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇచ్చింది. ముందు ఫ్రంట్ లైన్స్ వారియర్స్కు టీకా అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ అయా రాష్ట్రాలకు చేరిపోయింది. అయితే, తమకు కూడా ముందు వరుసలో టీకా వేయాలని రాజకీయనేతలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మొదటి విడతలో రాజకీయ పార్టీల నాయకులు, మంత్రులు, శాసన సభ్యులకు టీకాలు వేసేందుకు అనుమతించాలని కోరుతూ పాండిచ్చేరి సీఎం నారాయణస్వామి.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
దేశవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి మెగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుకానుంది. ఇప్పటికే పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి మొదటి విడుత డోసులు దేశంలోని 13 ప్రాంతాలకు చేరాయి. దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి కేంద్ర సర్కార్ అనుమతినిచ్చింది. మొదటి దశలో సుమారు మూడు కోట్ల మంది ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్లైన్ కార్మికులకు టీకాలు వేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రకటించారు. రెండో దశలో 50 ఏళ్లు పైబడిన, 50 ఏళ్లలోపు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి టీకాలు వేయనున్నట్లు చెప్పారు. అనంతరం మిగిలినవారికి టీకా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రజా ప్రతినిధులకు కూడా మొదటి విడతలో అవకాశం కల్పించాలని సీఎం నారాయణస్వామి ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.