ఓఎల్ఎక్స్లో అమ్మకానికి యుద్ధ విమానం…!
OLXలో మనం ఇప్పటి వరకు మొబైల్ ఫోన్లు, బైకులు, కార్లు, గృహోపకరణాలను మాత్రమే అమ్మకానికి ఉంచేవారిని చూశాం. ఆ మధ్య ఓ ప్రభుద్దుడు ఆన్లైన్ అమ్మకాల్లో...
OLXలో మనం ఇప్పటి వరకు మొబైల్ ఫోన్లు, బైకులు, కార్లు, గృహోపకరణాలను మాత్రమే అమ్మకానికి ఉంచేవారిని చూశాం. ఆ మధ్య ఓ ప్రభుద్దుడు ఆన్లైన్ అమ్మకాల్లో భార్యకు అమ్మకానికి ఉంచి పెద్ద సంచలనంగా మారాడు. ఇప్పుడు తాజాగా ఓ ప్రబుద్ధుడు ఏకంగా భారత యుద్ధ విమానాన్నే అమ్మకానికి పెట్టాడు. అదికూడా ఎంతో ప్రతిష్టాత్మకమైన యుద్ధ విమానం.. అదులోనూ అది పాకిస్తాన్ సైనికులకు చుక్కలు చూపించిన యుద్ధ విమానం.
భారత వాయుసేన (IAF)కు చెందిన మిగ్-23 యుద్ధ విమానాన్ని ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీకి 2009లో ఐఏఎఫ్ బహుమతిగా ఇచ్చింది. దీనిని యూనివర్శిటీ ఆవరణలోని ఇంజనీరింగ్ కళాశాల ముందు భాగంలో ప్రదర్శనకు ఉంచారు. అయితే ఎవరో ఆకతాయి రూ.9.99 కోట్లకు ఈ యుద్ధ విమానాన్ని ఓఎల్ఎక్స్లో అమ్మకానికి ఉంచాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.
ఈ ఘటనపై యూనివర్శిటీ అధికార ప్రతినిధి వసీమ్ అలీ స్పందించారు. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న తర్వాత ఈ యుద్ధ విమానాన్ని ఇంజనీరింగ్ విద్యార్థుల పరిశోధనల కోసం యూనివర్శిటీకి ఐఏఎఫ్ బహుమతిగా ఇచ్చిందని అన్నారు. ఇంతటి చరిత్ర కలిగిన విమానం అమ్మకానికి ఉంచడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. యూనివర్సిటీ ప్రతిష్ఠ దెబ్బతీయడానికే ఎవరో ఆకతాయిలు ఈ పని చేసి ఉంటారని అభిప్రాయ పడ్డారు. దీనిపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వసీమ్ అలీ చెప్పారు. ప్రస్తుతం (OLX) ఓఎల్ఎక్స్ ప్రతినిధులు ఈ ప్రకటనను తొలగించారు. అయితే ఇంతటి పిచ్చిపనికి పాల్పడిన ప్రభుద్ధుడిని పట్టుకునే పనిలో పడ్డారు యూపీ పోలీసులు.