ఏసీపీ నరసింహారెడ్డి అక్రమాస్తులు ఎన్నికోట్లంటే..??
ఏసీపీ నరసింహారెడ్డి అక్రమాస్తులు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. బహిరంగ మార్కెట్లో వాటి విలువ 100 కోట్ల వరకు ఉండొచ్చని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.
ఏసీపీ నరసింహారెడ్డి అక్రమాస్తులు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. బహిరంగ మార్కెట్లో వాటి విలువ 100 కోట్ల వరకు ఉండొచ్చని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ, ఏపీలో 25 చోట్ల ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో అనేక అక్రమాస్తులు వెలుగు చూశాయి. దీంతో ఏసీబీ అధికారులు అతన్ని అరెస్టు చేశారు.
పోలీస్శాఖలో ఉన్నతాధికారిగా చెలామణి అయిన నరసింహారెడ్డి ఆస్తులు అనకొండను తలపిస్తున్నాయి. ఖాకీ డ్రెస్ ను అడ్డపెట్టుకొని అక్రమాలకు పాల్పడి ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించాడని ఆరోపణలున్నాయి. కొందరు రాజకీయ నేతలతో సంబంధాలున్నాయన్న ప్రచారమూ ఉంది.
మరోవైపు రియల్ ఎస్టేట్రంగంలోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్కు చెందిన ఓ బార్ యజమాని నరసింహారెడ్డికి సన్నిహితంగా ఉంటూ అతనికి బినామీగా ఉన్నాడని తెలుస్తోంది. ఏసీపీ అక్రమ సంపాదనంతా బార్ యజమానే మేనేజ్ చేసేవాడని, ఓ ఉన్నతాధికారికి కోట్ల రూపాయల విలువ చేసే బంగ్లాను ఏసీపీ కానుకగా ఇచ్చాడని ప్రచారం ఉంది.
నరసింహారెడ్డికి అసైన్డ్భూముల వ్యవహారంలో తలదూర్చే అలవాటుందని తెలుస్తోంది. ఆ క్రమంలోనే కొండాపూర్లోని ఓ భూమి వివాదంలో జోక్యం చేసుకొని ఏసీబీకి చిక్కినట్టుగా తెలుస్తోంది. ఈ భూమిని కరీంనగర్ జిల్లాకు చెందిన ఎంపీపీ మధుకర్ ద్వారా కొనుగోలు చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో జగిత్యాల జిల్లా గంగాధర్లోని అతని ఇంట్లో కూడా సోదాలు చేపట్టారు. ఏసీబీ ఆఫీసర్లను చూసి ఎంపీపీ మధుకర్ పారిపోయినట్టు సమాచారం.
ఏసీబీ దాడుల్లో అనంతపురంలో 55 ఎకరాల వ్యవసాయభూమి, మాదాపూర్లోని సైబర్టవర్ ఎదుట 1,960 చదరపు గజాల నాలుగు ప్లాట్లు, హఫీజ్పేటలో మూడంతస్తుల భవనం, రెండు ఓపెన్ ప్లాట్లు, మరో రెండు ఇళ్లను గుర్తించారు. బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షల నగదు, రెండు బ్యాంకు లాకర్లున్నట్టు చెప్పారు. ఆస్తుల విలువ రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం. రూ.7.5 కోట్లు ఉంటుందని చెబుతున్నప్పటికీ.. బహిరంగ మార్కెట్లో రూ.100 కోట్లకు పైగానే ఉంటాయని అంటున్నారు.
అక్రమాస్తులను కూడగట్టే క్రమంలో నరసింహారెడ్డి పక్కా ప్లాన్తో ముందుకు కదిలినట్టుగా ఏసీబీ అధికారులు ఆధారాలను సేకరించారు. గిఫ్ట్డీడ్లతో ఆస్తుల కొనుగోలుకు తెరతీసినట్టుగా గుర్తించారు. తనకు అనుకూలమైన వారిని బినామీలుగా ఎంచుకుని వారి పేర్ల మీద సైబరాబాద్ ప్రాంతంలో ఆస్తులను కొన్నట్టు తేలింది. 2016లో ఒకేసారి పెద్దల నుంచి వారసత్వంగా ఆస్తులు దక్కినట్టుగా గిఫ్ట్డీడ్లు సృష్టించడంపై ఆధారాలు దొరకడంతో నరసింహారెడ్డి బండారం బయటపడింది.
నార్సింగి ప్రాంతంలో తోటమాలిగా పనిచేసే ఓ వ్యక్తి కూడా నరసింహారెడ్డి బినామీగా తెలుసుకుని ఏసీబీ అధికారులు ఆశ్చర్యపోయారు. పోలీసు అధికారిగా పనిచేస్తూనే రియల్ఎస్టేట్, హోటల్ వ్యాపారాలు చేస్తున్నట్టుగా ఏసీబీ అధికారులు కనుగొన్నారు. పెద్ద అంబర్పేటలో ఎకరం స్థలంలో ఓ హోటల్ ఏర్పాటుచేసి, 90 లక్షల లోన్ కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. తెరవెనుక బినామీల లిస్టు బాగానే ఉందని గుర్తించిన ఏసీబీ అధికారులు.. మొత్తం కూపీ లాగే పనిలో పడ్డారు.