విషాదాంతమైన ప్రేమ వివాహం

క్షణికావేశంలో ఓ వివాహిత తీసుకున్న నిర్ణయానికి రెండు జీవితాలు బలైపోయాయి. పుట్టింటికి వెళ్లేందుకు భర్త నిరాకరించాడన్న ఆవేశంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కృష్ణాజిల్లా, వీరులపాడు మండలం అల్లూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది.

విషాదాంతమైన ప్రేమ వివాహం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 13, 2020 | 9:44 AM

క్షణికావేశంలో ఓ వివాహిత తీసుకున్న నిర్ణయానికి రెండు జీవితాలు బలైపోయాయి. పుట్టింటికి వెళ్లేందుకు భర్త నిరాకరించాడన్న ఆవేశంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కృష్ణాజిల్లా, వీరులపాడు మండలం అల్లూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. అల్లూరు గ్రామానికి చెందిన గుంజి వెంకటేశ్వరరావు, నవాబుపేటకు చెందిన శ్రావణి ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాలు వీరి వివాహానికి ఒప్పుకోలేదు. దీంతో పెద్దలను ఎదిరించి 2019 అక్టోబర్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అదే ఊరిలో వెంకటేశ్వరరావు వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 10న ఉదయం తన పుట్టింటికి వెళ్లి వస్తానని శ్రావణి భర్త వెంకటేశ్వరరావును అడిగింది. భర్త వెంకటేశ్వరరావు అందుకు ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన శ్రావణి క్షణికావేశంలో ఇంటిలోని పురుగుల మందు తాగింది. దీన్ని గమనించిన భర్త వెంకటేశ్వరరావు వెంటనే నందిగామ ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లాడు. ప్రథమ చికిత్స అనంతరం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భార్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో తట్టుకోలేని వెంకటేశ్వరరావు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా స్థానికులు ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. అయితే శుక్రవారం ఉదయం శ్రావణి మృతి చెందగా సాయంత్రం వెంకటేశ్వరరావు తుది శ్వాస విడిచాడు.