‘ చచ్చిన ‘ వార్తాపత్రికలతో పాక్ వ్యతిరేక ప్రచారం.. ఇండియన్ కంపెనీయా ? మజాకా ?
ఇండియాలోని ఓ అజ్ఞాత కంపెనీ… పాకిస్తాన్ వ్యతిరేక ప్రచారం చేసేందుకు భలే ఐడియా వేసింది. ఈ ప్రచారాన్ని వ్యాప్తి చెందింపజేసేందుకు ఈ సంస్థ 65 దేశాల్లో సుమారు 265 వెబ్ సైట్లను నిర్వహిస్తోందంటే నమ్మలేం. యూరప్ లో పాక్ పట్ల నిరసన ప్రదర్శనలు జరగడానికి ఈ ప్రచారమే కారణమట. భారతీయ ప్రయోజనాలకు అనుకూలంగా యూరప్ దేశాల్లోని ఎంపీలు, ప్రజా ప్రతినిధులు వ్యవహరించేలా చూడడమే దీని లక్ష్యమట. ఈ వైనం గత ఆగస్టులో కాశ్మీర్ లో తలెత్తిన సంక్షోభ […]
ఇండియాలోని ఓ అజ్ఞాత కంపెనీ… పాకిస్తాన్ వ్యతిరేక ప్రచారం చేసేందుకు భలే ఐడియా వేసింది. ఈ ప్రచారాన్ని వ్యాప్తి చెందింపజేసేందుకు ఈ సంస్థ 65 దేశాల్లో సుమారు 265 వెబ్ సైట్లను నిర్వహిస్తోందంటే నమ్మలేం. యూరప్ లో పాక్ పట్ల నిరసన ప్రదర్శనలు జరగడానికి ఈ ప్రచారమే కారణమట. భారతీయ ప్రయోజనాలకు అనుకూలంగా యూరప్ దేశాల్లోని ఎంపీలు, ప్రజా ప్రతినిధులు వ్యవహరించేలా చూడడమే దీని లక్ష్యమట. ఈ వైనం గత ఆగస్టులో కాశ్మీర్ లో తలెత్తిన సంక్షోభ సమయంలో అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ నెలలో ఆ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 అధికరణాన్ని మోడీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. బ్రస్సెల్స్ లోని ఓ ఎన్జీఓ సంస్థకు చెందిన రీసెర్చర్లు.. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతమున్న.. ఏనాడో మూత బడిన మీడియా సైట్లను, వార్తా పత్రికలను ఈ అజ్ఞాత సంస్థ తన ప్రచారానికి అనుకూలంగా వాడుకుంటోందని కనిపెట్టారు. వీటిలో అమెరికాలోని పలు పోర్టల్స్ కూడా ఉన్నాయి. నిజానికి ‘ న్యూయార్క్ మార్కింగ్ టెలిగ్రాఫ్ ‘ అన్న పోర్టల్ 1972 లోనే మూతబడింది. ఇలాగే మరికొన్ని కూడా ! ప్రస్తుతమున్న టైమ్స్ ఆఫ్ లాస్ ఏంజిలిస్, లాస్ ఏంజిలిస్ టైమ్స్ వంటి మీడియా పేర్లను వాడుకుంటూ తప్పుదారి పట్టించడానికి ఈ కంపెనీయత్నిస్తోందని ఈ పరిశోధకులు కనుక్కున్నారు. అలాగే టైమ్స్ ఆఫ్ పొంగ్యాంగ్ అనే నార్త్ కొరియన్ వెబ్ సైట్ కూడా వీటిలో ఉంది. ఉత్తర కొరియాకు చెందిన కేసీఎన్ఏ, అలాగే రష్యాకు చెందిన ఇంటర్ ఫాక్స్ వంటి వాటితో బాటు ఇతర న్యూస్ ఏజన్సీల నుంచి సమాచారాన్ని కాపీ పేస్ట్ చేసి .. దాదాపు ఒకే విధమైన కంటెంట్ ను ఈ నెట్ వర్క్ సర్క్యులేట్ చేస్తున్నట్టు వెల్లడైంది. ఇదంతా పాకిస్తాన్ వ్యతిరేక ప్రచారానికి, యూరప్ లో నిరసన ప్రదర్శనలకు దోహదపడుతున్నదని కనుగొన్నారు. యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ పాకిస్తానీ మైనారిటీస్ వంటి గ్రూపులు ఈ ప్రదర్శనలను నిర్వహిస్తున్నాయి. అదే విధంగా ఫేక్ యూరోపియన్ పార్లమెంట్ మ్యాగజైన్ కూడా ఉందని రీసెర్చర్లు కనుగొన్నారు. ఈ ‘ యాక్టివిటీ ‘ ని వారు ఢిల్లీలోని శ్రీవాస్తవ గ్రూప్ అనే సంస్థకు లింక్ చేశారు. యూరప్ ఎంపీలు కొందరు ఈ సైట్ ని విజిట్ చేసి.. దీనికి నిధులు కూడా అందజేశారట. అయితే ఈ సంస్థకు, ఈ బిజినెస్ కు సంబంధం లేదని ఇండియన్ వెబ్ సైట్ ‘ ది వైర్ ‘ అంటోంది. ఏమైనా.. భారతీయుడి ‘ బుర్ర… బుర్రే గురూ ‘ అన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి.