ఫలించిన చర్చలు.. స్వదేశానికి 367 మంది భారతీయులు..!
దేశవ్యాప్తంగా వివిధ ఇమ్మిగ్రేషన్ నిర్బంధ కేంద్రాల్లో ఉంచిన 367 మంది భారతీయులను ఇండియాకు తరలించేందకు మలేషియా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో
దేశవ్యాప్తంగా వివిధ ఇమ్మిగ్రేషన్ నిర్బంధ కేంద్రాల్లో ఉంచిన 367 మంది భారతీయులను ఇండియాకు తరలించేందకు మలేషియా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో మలేషియా ప్రభుత్వం కూడా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని మలేషియా ప్రభుత్వం కూడా లాక్డౌన్ నిబంధనలు సడలిస్తూ.. అక్రమంగా నివసిస్తున్న వలస కార్మికులు, శరణార్థులను అదుపులోకి తీసుకోవాల్సిందిగా భద్రతా దళాలను ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు అక్రమ వలసదారులు, శరణార్థులను అదుపులోకి తీసుకున్నాయి.
మలేషియా ఎయిర్లైన్స్ నడుపుతున్న రెండు చార్టర్ విమానాల ద్వారా మలేషియా ప్రభుత్వం కొంతమందిని ఇండియాకు తరలించింది. అయితే.. కరోనా లాక్డౌన్ కారణంగా వీసా గడువు ముగిసిపోయి అక్కడే చిక్కుకున్న భారతీయులను కూడా భద్రతా దళాలు బంధించాయి. దీంతో రంగంలోకి దిగిన కౌలాలంపూర్లోని భారత హైకమిషన్.. మలేషియా ప్రభుత్వంతో చర్చలు జరిపింది. చర్చలు ఫలించడంతో భద్రతా దళాల అదుపులో ఉన్న సుమారు 367 మంది భారతీయులను.. విడతల వారీగా ఇండియాకు తరలించేందుకు మలేషియా ప్రభుత్వం అంగీకరించింది.