ఎన్నికలకు ముందే బీజేపీ బోణీ
ఈటా నగర్ : ఎన్నికలు జరగకముందే బీజేపీ బోణి కొట్టింది. అరుణాచల్ ప్రదేశ్లో లోక్సభ ఎన్నికలతో పాటుగా శాసన సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే, ఎన్నికలు జరగకుండానే ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీనిపై గురువారం అధికారికంగా ఈసీ ప్రకటన వెలువరించింది. రెండు స్థానాల్లో ప్రత్యర్థి పార్టీల నేతలు తమ నామినేషన్లను అసంపూర్తిగా సమర్పించడంతో.. రిటర్నింగ్ అధికారులు వాటిని తిరస్కరించారు. మరో స్థానంలో ఓ అభ్యర్థి తన నామినేషన్ను ఉపసంహరించుకోవడంతో పోటీ నుంచి […]
ఈటా నగర్ : ఎన్నికలు జరగకముందే బీజేపీ బోణి కొట్టింది. అరుణాచల్ ప్రదేశ్లో లోక్సభ ఎన్నికలతో పాటుగా శాసన సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే, ఎన్నికలు జరగకుండానే ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీనిపై గురువారం అధికారికంగా ఈసీ ప్రకటన వెలువరించింది. రెండు స్థానాల్లో ప్రత్యర్థి పార్టీల నేతలు తమ నామినేషన్లను అసంపూర్తిగా సమర్పించడంతో.. రిటర్నింగ్ అధికారులు వాటిని తిరస్కరించారు. మరో స్థానంలో ఓ అభ్యర్థి తన నామినేషన్ను ఉపసంహరించుకోవడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో ఈ స్థానాల్లో ఇతర అభ్యర్థులెవ్వరూ పోటీలో లేకపోవడంతో ముగ్గురు బీజేపీ నేతలు ఏకగ్రీవంగా విజయం సాధించారు. గెలుపొందిన వారిలో పశ్చిమ సియాంగ్ జిల్లాలోని తూర్పు స్థానం నుంచి కెంటో జిని, లోయర్ సుబన్సిరి జిల్లాలోని యాచులి స్థానం నుంచి తబా టెడిర్, పశ్చిమ కమెంగ్ జిల్లాలోని దిరంగ్ నుంచి ఫుర్ప సెరింగ్ విజయం సాధించారు.
పశ్చిమ సియాంగ్ జిల్లాలోని తూర్పు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థికి పోటీగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మిన్కిర్ లోల్లెన్ పోటీ చేయాలనుకున్నారు. అయితే, నామినేషన్ పత్రాల్లో తన తండ్రి పేరుకి బదులుగా గ్రామం పేరు రాశారు. దీంతో ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది. అంతేకాదు ఆయన తన కుల ధ్రువీకరణ పత్రాన్ని కూడా జతపరచలేదు. ఇక లోయర్ సుబన్సిరి జిల్లాలోని యాచులి స్థానం నుంచి యోకో యారమ్ అనే మహిళ జేడీయూ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీకి దిగడానికి నామినేషన్ సమర్పించారు. ఆమె సమర్పించిన నామినేషన్ పేపర్లలోనూ పొరపాట్లు ఉండడంతో తిరస్కరణకు గురైంది. దీంతో ఈ స్థానాల్లో బీజేపీ అభ్యర్ధులు మాత్రమే మిగలడంతో విజేతలుగా ప్రకటించామని అరుణాచల్ ప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి కలింగ్ టయెంగ్ తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ గురువారంతో ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇక పశ్చిమ కమెంగ్ జిల్లాలోని దిరంగ్ నుంచి బీజేపీ నేత ఫుర్ప సెరింగ్కు పోటీగా ఇద్దరు నామినేషన్లు వేయగా, వారిద్దరూ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో పోటీలో మిగిలిన సెరింగ్ గెలుపొందినట్టు ఈసీ అధికారులు ప్రకటించారు.