జమ్మూలో నక్కిన 300 మంది ఉగ్రవాదులు.. ఏరిపారేస్తామన్న డీజీపీ
జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి లోయలో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు పాకిస్థాన్ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. కశ్మీర్లోకి తీవ్రవాదులను పంపేందుకు సరిహద్దుల్లో తరచూ కాల్పులు విరమణ ఉల్లంఘనకు పాల్పడుతోంది. మరోవైపు వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ భూభాగం నుంచి ఉగ్రవాదులు చొరబాటుకు సిద్ధంగా ఉన్నట్టు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ మాట్లాడుతూ.. ఉగ్రవాదుల చొరబాటు యత్నాలను భద్రత దళాలు సమర్ధంగా […]
జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి లోయలో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు పాకిస్థాన్ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. కశ్మీర్లోకి తీవ్రవాదులను పంపేందుకు సరిహద్దుల్లో తరచూ కాల్పులు విరమణ ఉల్లంఘనకు పాల్పడుతోంది. మరోవైపు వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ భూభాగం నుంచి ఉగ్రవాదులు చొరబాటుకు సిద్ధంగా ఉన్నట్టు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ మాట్లాడుతూ.. ఉగ్రవాదుల చొరబాటు యత్నాలను భద్రత దళాలు సమర్ధంగా తిప్పికొడుతున్నా.. కొంతమంది ముష్కరులు సరిహద్దు దాటి లోనికి ప్రవేశించారని తెలిపారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్లో దాదాపు 200 నుంచి 300మంది ఉగ్రవాదులు క్రియాశీలకంగా ఉన్నారని.. వీరిలో చాలా మందిని ఎన్కౌంటర్లలో మట్టుబెట్టామని.. మరికొంత మంది పట్టుబడ్డారని తెలిపారు.
ఇక ప్రస్తుతం జమ్మూ కశ్మీర్లో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నాయని డీజీపీ వెల్లడించారు. జమ్మూ, లేహ్, కార్గిల్ ప్రాంతాల్లో పరిస్థితులు శాంతియుతంగానే ఉన్నాయని, కశ్మీర్లోనూ క్రమంగా శాంతియుత వాతావరణం నెలకొంటోందని ఆయన వివరించారు. ఆంక్షలు సడలించడంతో జనం బయటకు వస్తున్నారని, కొన్ని చోట్ల రోడ్లపై ట్రాఫిక్ ఎక్కువగా ఉందని డీజీపీ తెలిపారు. మార్కెట్లు, దుకాణ సముదాయాలు తెరుచుకోవడంతో వ్యాపార కార్యకలాపాలు మొదలయ్యాయని అన్నారు. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత చక్కబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చొరబాట్లు యత్నాలు తీవ్రమైన నేపథ్యంలో పోలీసులు, భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సూచించారు. ఉరి, రాజౌరి, పూంచ్ సహా పలుచోట్ల కాల్పులు ఉల్లంఘనలు అధికంగా ఉన్నాయని తెలియజేశారు.