జ్ఞానస ఎక్కడుంది..? తల్లి చెప్పిందే నిజమా..? మిస్టరీగా చిన్నారి అదృశ్యం..!
క్షణికావేశం వారి పచ్చటి సంసారంలో చిచ్చుపెట్టింది. ఓ చిన్న విషయంలో భార్య, భర్త మధ్య జరిగిన గొడవ.. ఏడాదిన్నర చిన్నారి పాలిట శాపమైంది. ఐదు రోజులైనా ఆ చిన్నారి ఆచూకీ కనిపించలేదు. అసలు ఆ బిడ్డ బ్రతికే ఉందా..? లేక చనిపోయిందా..? కుమార్తె చనిపోయిందని చెప్పిన తల్లి ఆ చిన్నారిని ఎక్కడ పూడ్చిపెట్టింది..? ఈ ప్రశ్నలన్నింటిని చేధించే పనిలో పడ్డారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే.. పెందుర్తి పులగవానిపాలెం ప్రాంతానికి చెందిన కరక అప్పారావు విజయనగరం జిల్లా గజపతినగరం […]
క్షణికావేశం వారి పచ్చటి సంసారంలో చిచ్చుపెట్టింది. ఓ చిన్న విషయంలో భార్య, భర్త మధ్య జరిగిన గొడవ.. ఏడాదిన్నర చిన్నారి పాలిట శాపమైంది. ఐదు రోజులైనా ఆ చిన్నారి ఆచూకీ కనిపించలేదు. అసలు ఆ బిడ్డ బ్రతికే ఉందా..? లేక చనిపోయిందా..? కుమార్తె చనిపోయిందని చెప్పిన తల్లి ఆ చిన్నారిని ఎక్కడ పూడ్చిపెట్టింది..? ఈ ప్రశ్నలన్నింటిని చేధించే పనిలో పడ్డారు పోలీసులు.
వివరాల్లోకి వెళ్తే.. పెందుర్తి పులగవానిపాలెం ప్రాంతానికి చెందిన కరక అప్పారావు విజయనగరం జిల్లా గజపతినగరం రైల్వేలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఆయనకు ఆరేళ్ల కిందట కుసుమలతతో వివాహమైంది. వీరికి సోనిక, జ్ఞానస అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే ఓ విషయంలో కుసుమలతకు.. ఆమె అత్తామామలకు మధ్య ఇటీవల గొడవ జరిగింది. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ నేపథ్యంలో ఈ నెల 6న రాత్రి 2.30గం.ల సమయంలో చిన్నపాప జ్ఞానస ఏడవడంతో.. బాత్రూమ్కు తీసుకెళ్లింది కుసుమలత. ఆ తరువాత చాలాసేపు గడిచినా ఆమె లోపలికి రాకపోవడంతో.. భర్త అప్పారావు, కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఆ తరువాత ఆమె అదృశ్యంపై 7వ తేదిన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇక ఇంటి నుంచి పాపతో అదృశ్యమైన కుసుమలత పలు ప్రాంతాల్లో సంచరించి.. నిద్ర, తిండి లేక నీరసంగా తయారైంది. ఆమె సెల్ఫోన్ కాల్డేటా, టవర్ లొకేషన్, కాల్లిస్ట్ తదితర ఆధారాలతో చినముషిడివాడలోని వుడా కాలనీ శివారు కొండ ప్రాంతంలో కుసుమలత ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక అదే ప్రాంతంలో మేకలు మేపుతున్న కొందరు ఒంటరిగా కుసుమలతను చూసి వారి ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో కుసుమలతను అదుపులోకి తీసుకున్న పోలీసులు జ్ఞానస గురించి ప్రశ్నించగా.. కుమార్తె పాలు లేక ఏడుస్తూ చనిపోయిందని చెప్పింది. మృతదేహం గురించి ప్రశ్నించగా.. కొండ ప్రాంతంలో పూడ్చినట్లు చెప్పింది. దీంతో ఆ ప్రాంతానికి వెళ్లి చూడగా.. ఎక్కడా ఆ చిన్నారి మృతదేహం కనిపించలేదు. దీంతో ఎర్రకొండపై ఆమె కోసం పోలీసులు గాలింపు కొనసాగుతోంది. జ్ఞానస ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలుగా పోలీసులు విడిపోయారు. డాగ్స్క్వాడ్తో ఎర్రకొండపై గాలిస్తున్నట్లు ఏసీపీ స్వరూపారాణి చెబుతున్నారు. మనస్తాపంతో కుసుమలత ఆత్మహత్య చేసుకోవాలనుకుందని.. చేతికి ఉన్న ఉంగరాలు మింగేసిందని.. వైద్యపరీక్షల్లో కుసుమలత కడుపులో రెండు ఉంగరాలు కనిపించాయని ఏసీపీ అంటున్నారు. ఇక జ్ఞానస మృతదేహాన్ని జంతువులు ఏమైనా తినేశాయా..? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు స్వరూపారాణి చెప్పారు.