అంతుచిక్కని వ్యాధితో 18 మంది మృతి !
అసలే కరోనా వైరస్ తో అల్లాడిపోతుంటే ఆ గ్రామాన్ని మరో అంతుచిక్కని వ్యాధి గడగడలాడిస్తోంది.
అసలే కరోనా వైరస్ తో అల్లాడిపోతుంటే ఆ గ్రామాన్ని మరో అంతుచిక్కని వ్యాధి గడగడలాడిస్తోంది. అసలు వ్యాధి ఏంటో తెలియకుండానే మనుషులు చనిపోతుండటంతో అక్కడి ప్రజలు అయోమయంలో ఉన్నారు. ఒరిస్సాలోని నవరంగపూర్ జిల్లా కొశాగుమడ సమితిలోని బొడొ అటిగాం గ్రామంలో ఈ మాయదారి రోగం ప్రబలింది. గడిచిన మూడు, నాలుగు రోజుల్లో గ్రామంలోని 18 మంది అంతుచిక్కని వ్యాధితో మృతి చెందారు. మున్ముందు ఎవరు మరణిస్తారో తెలియని స్థితిలో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు
వివరాల్లోకి వెళ్తే బొడొ అటిగాం గ్రామంలో దాదాపు 760 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇటీవల గ్రామంలో 18 మంది అకస్మాత్తుగా చనిపోయారని గ్రామస్తులు వెల్లడిస్తున్నారు. ప్రాణాలు విడిచిన వారిలో ఒక సంవత్సరం లోపు వయసు వారు ముగ్గురు, 15 ఏళ్ల వయసు గల ఇద్దరు యువతులు, 25 నుంచి 35 ఏళ్ల వయసు వారు ఏడుగురు, 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు వారు ఆరుగురు ఉన్నారని గ్రామస్థులు చెబుతున్నారు. వారంతా మొదట జ్వరం వచ్చి తరువాత వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురై మృతి చెందారని తెలిపారు. అయితే ఇంత జరుగుతున్నా ఆ గ్రామానికి వైద్యబృందం రాకపోవడం గమనార్హం.
Also Read :