నిజామాబాద్లో కొత్తగా 10 కరోనా పాజిటివ్ కేసులు!
కరోనా కరాళ నృత్యం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇపుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో సోమవారం కొత్తగా 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు.
కరోనా కరాళ నృత్యం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇపుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో సోమవారం కొత్తగా 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. మొత్తం 20 కేసుల ఫలితాలు రాగా.. అందులో 10 పాజిటివ్, 10 నెగిటివ్గా తేలినట్లు వివరించారు. పాజిటివ్ వచ్చిన 10 మందిలో ఏడుగురు ఢిల్లీ వెళ్లొచ్చిన వారు కాగా.. ముగ్గురు ప్రైమరీ కాంటాక్ట్ వ్యక్తులని చెప్పారు. తాజాగా నమోదైన కేసులతో జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 29కి చేరిందన్నారు.
కాగా.. జిల్లా నుంచి 59 మంది ఢిల్లీ వెళ్లారని కలెక్టర్ తెలిపారు. అందులో ఒకరు మృతి చెందగా.. ఇంకొకరు ఢిల్లీలోనే ఉన్నారని చెప్పారు. 56 మంది శాంపిళ్లను పరీక్షించగా.. అందులో 25 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. నలుగురు ప్రైమరీ కాంటాక్ట్ వ్యక్తులకు పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 176 శాంపిళ్లు సేకరించామని, 200మంది ఐసోలేషన్లో ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం నిజామాబాద్ హాట్స్పాట్ జాబితాలో ఉందని తెలిపారు. నిజామాబాద్ నగరంలో అహ్మద్ పుర, మాలపల్లి, హబీబ్ నగర్, ఆటోనగర్, ఖిల్లా రోడ్డులను కంటైన్మెంట్ ప్రాంతాలుగా గుర్తించామన్నారు. వీటితో పాటు మాక్లూర్, నందిపేట్, బోదన్, రెంజల్, భీంగల్, బాల్కొండను కూడా కంటైన్మెంట్ ప్రాంతాలుగా గుర్తించామని కలెక్టర్ వివరించారు.